జ్ఞాన నిలయం, అక్షర రూపంలో ఉన్న అనుభవాలను, చరిత్ర లను పదిలంగా అందించే పవిత్ర దేవాలయం. మనిషిని విజ్ఞానిగా తీర్చిదిద్దే సంస్కృతి కేంద్రం..
ఒక పుస్తకాన్ని తెరవడం అంటే కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టడమే. అటువంటి వేల ప్రపంచాలను తనలో దాచుకున్న నిశ్శబ్ద విజ్ఞాన గని గ్రంథాలయం. ‘నేను నశించినా పర్వాలేదు కానీ గ్రంథాలయాలు వర్ధిల్లాలి’ అన్న మహానుభావుల మాటలు, సమాజ అభివృద్ధిలో వాటి పాత్ర ఎంతటిదో తెలియజేస్తాయి.

అలాంటి అపురూప విజ్ఞానఘని మన
ఆంధ్రా యూనివర్సిటీ కేంద్ర గ్రంథాలయం. 1927లో ప్రారంభమైన ఈ లైబ్రరీ ఎందరో మహనీయులసేవ లో తరించింది. ప్రస్తుత గ్రంధాలయ భవనానికి 1957లో నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి శంఖుస్థాపన చేయగా గ్రంధాలయానికి డాక్టర్ వి.ఎస్. కృష్ణ లైబ్రరీ గా 1968లో పేరు పెట్టారు. ఈ కార్యక్రమంలో యూజీసీ చైర్మన్ డాక్టర్ డి.ఎస్.కొఠారి స్వయంగా పాల్గొన్నారు.

ప్రస్తుతం ప్రధాన గ్రంధాలయంతో పాటు ఇంజనీరింగ్ కళాశాల, న్యాయ కళాశాల గ్రంధాలయాలు అనుబంధంగా సేవలు అందిస్తున్నాయి. డాక్టర్ వి.ఎస్. కృష్ణ లైబ్రరీ 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఒక సెమినార్/గ్రూప్ డిస్కషన్ రూమ్ కూడా ఉంది. ఈ లైబ్రరీలో ఒకేసారి 500 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. గ్రంధాలయంలో ఐదు లక్షలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. ఏయూ గ్రంధాలయంలో తాళపత్రాలు మరియు కాగితాలపై రాసిన 2,663 అరుదైన, విలువైన హస్తప్రతులుకూడా ఉన్నాయి. అంతేకాకుండా, అప్పటి పార్లమెంటు సభ్యులు సంతకం చేసిన భారత రాజ్యాంగం యొక్క అసలు ప్రతి కూడా ఇక్కడ ఉంది. ఇప్పటికే తాళపత్రాలను డిజిటలైజేష్ చేసే ప్రక్రియ మెదటి దశ పూర్తయింది.

