పశ్చిమాసియా లో సంక్షోభం నెలకొన్నప్పటికీ దేశంలో ఎల్పీజీ పంపిణీ సాధారణంగా ఉందని, ఎక్కడా సిలిండర్ల కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కమర్షియల్ సిలిండర్ల సరఫరా కూడా 70 శాతం వరకు కొనసాగుతోందని ప్రస్తుతం 95 శాతం సిలిండర్ల డెలివరీ అథెంటికేషన్ కోడ్ ద్వారానే జరుగుతోందని కేంద్ర పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ వెల్లడించారు. పైపుడ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ల విస్తరణ వేగంగా జరుగుతోందని, ఇప్పటికే లక్షలాది మంది వినియోగదారులు పీఎన్జీ వైపు మొగ్గు చూపుతున్నారని ఆమె వివరించారు. గత రెండు రోజుల్లోనే దేశవ్యాప్తంగా 88.82 లక్షల సిలిండర్ల బుకింగ్లు నమోదు కాగా, వాటిలో 87.28 లక్షల సిలిండర్లను వినియోగదారులకు విజయవంతంగా అందజేసినట్లు ఆమె వెల్లడించారు. గృహ అవసరాలతో పాటు వాణిజ్య విభాగం లోనూ విక్రయాలు జోరుగా సాగుతున్నాయని తెలిపారు. గత రెండు రోజుల్లో దాదాపు 15,900 టన్నుల కమర్షియల్ ఎల్పీజీ, 876 టన్నుల ఆటో ఎల్పీజీ విక్రయాలు నమోదయ్యాయన్నారు. అలాగే, 5 కేజీల చిన్న సిలిండర్ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఏప్రిల్ 3 నుండి దేశవ్యాప్తంగా 10,000 పైగా అవగాహన సదస్సులు నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఈ సదస్సుల ద్వారా ఇప్పటివరకు 1.84 లక్షలకు పైగా 5 కేజీల సిలిండర్లను విక్రయించినట్లు తెలిపారు.
previous post
next post
