రాజకీయాల్లో ‘విలువలు’ అనేవి కేవలం ఎన్నికల మేనిఫెస్టోలకే పరిమితమా? నిన్నటి వరకు ఎవరినైతే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని గొంతు చించుకుని విమర్శించారో, ఈరోజు ఆ జెండా నీడ చెంతనే చేరడాన్ని ఏమనాలి? అని ఆ ఎంపీ పై సోషల్ మీడియా జనం జంజీ టీమ్ తెగ మదన పడుతున్నారు..! ఆమ్ ఆద్మీ పార్టీ యువ కిశోరం రాఘవ చద్దా బీజేపీ తీర్థం పుచ్చుకోవడం భారత రాజకీయాల్లో నెలకొన్న నైతిక సంక్షోభానికి నిలువెత్తు సాక్ష్యం అని కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి..! ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కి చెందిన కీలక నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ చద్దా కేవలం ఒక రాజకీయనేత మాత్రమే కాదు, ఒక విద్యావంతుడైన యువత గొంతుక. రాజ్యసభలో ఆయన ప్రసంగాలు, సోషల్ మీడియాలో ఆయన ఇచ్చే కౌంటర్లు లక్షలాది మందికి మంచి కిక్కునిచ్చాయి. కానీ, పార్టీ మారగానే తన పాత పోస్టులను డిలీట్ చేయడం ద్వారా ఆయన తన సొంత గళాన్ని, గతాన్ని చెరిపేసే ప్రయత్నం చేశారు. ఇది కేవలం ట్వీట్ల తొలగింపు మాత్రమే కాదని, తనని నమ్మిన కోట్లాది మంది అభిమానుల నమ్మకాన్ని చెరిపివేయడం అని భావించిన ఫాలోవర్స్ టప టపా అని అన్ ఫాలో కొడుతున్నారు. కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధి లొనే ఒక మిలియన్ కు పైగా ఫాలోవర్స్ అన్ ఫాలో ద్వారా పార్టీ మార్పు పై వారి నిరసన ను తెలియజేసారు. గతంలో అరవింద్ కేజ్రీవాల్కు అత్యంత సన్నిహితుడిగా ఉండి, బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన వ్యక్తి ఇప్పుడు అదే పార్టీలో చేరడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ విమర్శిస్తున్నారు. రాఘవ చద్దా తన సోషల్ మీడియా ఖాతాల (X/Twitter) నుండి గతంలో ప్రధాని మోదీ మరియు బీజేపీని విమర్శిస్తూ చేసిన పోస్ట్లను తొలగించారని ఆప్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు.

అవకాశవాదమా..? ఆత్మరక్షణా..?
జ్యోతిరాదిత్య సింధియా నుండి హిమంత బిశ్వ శర్మ వరకు చాలామంది పార్టీలు మారారు. కానీ చద్దా విషయంలో విమర్శలు పదునుగా ఉండటానికి కారణం ఆయన వచ్చిన నేపథ్యం. అవినీతికి వ్యతిరేకంగా, పారదర్శక రాజకీయాల కోసం పుట్టిన పార్టీ నుంచి వచ్చి, ఇప్పుడు అదే వ్యవస్థ లో భాగం కావడం విస్మయానికి గురిచేస్తోంది. పాత తరం నాయకులు పార్టీలు మారినప్పుడు పాత పేపర్ కటింగ్స్ వెతకాల్సి వచ్చేది. కానీ రాఘవ చద్దా డిజిటల్ యుగపు నాయకుడు. ఆయన గతంలో బీజేపీపై చేసిన విమర్శల వీడియోలు ఇప్పుడు ఆయనకే ట్రోల్ అవుతూ ఎదురు నిలుస్తున్నాయి. తన సిద్ధాంతాలను మార్చుకోవడం కంటే, తన విమర్శలను ప్రజలు మర్చిపోతారని అనుకోవడం నూరుశాతం తప్పే అవుతుంది.
రాజకీయాల్లోకి వస్తే వ్యవస్థను మార్చవచ్చు అని నమ్మిన ఎంతోమంది యువతకు రాఘవ చద్దా నిర్ణయం నిరాశపూరిత సందేశాన్ని ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.

వ్యూహాత్మక ఎత్తుగడే నా…?
రాజకీయాల్లో మనుగడ సాగించడానికి చాలా మంది నేతలు అధికారంలో ఉన్న పార్టీల వైపు మొగ్గు చూపుతుంటారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీలో చేరడం వల్ల ఆయన రాజకీయ భవిష్యత్తుకు కొత్త అవకాశాలు, కేంద్ర స్థాయిలో పదవులు లభించే అవకాశం ఉంటుందన్నది వాస్తవం.
ఆప్ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, బీజేపీలో చేరడం ఒక రకమైన రాజకీయ కవచంగా పనిచేస్తుందని విశ్లేషకులు భావిస్తుంటే అయితే పార్టీ మారింది భయం తో కాదని కేజ్రీవాల్ విధానాలు నచ్చకే బయట వచ్చానని చద్దా చెపుకొస్తున్నారు.
