ఏకాభిప్రాయం తోనే పునర్విభజన చేయాలని కోరిన రేవంత్ రెడ్డి

నియోజకవర్గాల పునర్విభజన తేనెతుట్టె కదిలింది. పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోతోందని జనాభా ప్రాతిపదికన నియోజకవర్గల పునర్విభజన జరిగితే ఉత్తరాది రాష్ట్రాల కబంధ హస్తాల్లో సౌత్ స్టేట్స్ విలవిల లాడిపోతాయన్నది ఇక్కడి వారి భావన నిజానికి గత కొన్ని దశాబ్దాలుగా దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ నను పకడ్బందీగా అమలు చేశాయి అదే సమయంలో నార్త్ స్టేట్స్ దీనిని అంత గా పట్టించుకోలేదు. అక్కడ జనాభా విపరీతంగా పెరిగింది. ఆ క్రమంలో జనాభా ప్రాతిపదికన లోక్ సభ అసెంబ్లీ సీట్ల పెంపు అంటే తాము తీవ్రంగా నష్టపోతామని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి ఉన్న స్థానాలకు మరో ఏభై శాతం సీట్లు పెంచబోతున్నట్లు చెప్పినా భయాలు మాత్రం వెన్నంటుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ పార్లమెంట్ సమావేశాలలో బిల్లు వచ్చే అవకాశమున్నందున ప్రతిపక్షాలు విజ్ఞప్తుల మొదలుపెట్టాయి. తమిళ నాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఘాటుగా స్పందించగా ఇప్పుడు పార్లమెంట్ ముందుకొస్తున్న బిల్లులన్నింటిపై జాతీయ స్థాయిలో విస్తృత చర్చలు జరపాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి లేఖ రాశారు. అన్ని రాజకీయ పార్టీలతో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పటికే ఇండియా కూటమి సమావేశం కానుండగా అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు, ఏకాభిప్రాయ సాధన ద్వారానే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తుపై ప్రభావం కలిగించే అంశమైనందున బాధ్యతతో అత్యవసరంగా ఈ లేఖ రాసినట్లు తెలిపారు. ప్రస్తుతం మహిళల రిజర్వేషన్, పునర్విభజన, లోక్‌సభ సీట్ల పెంపు అనే మూడు వేర్వేరు అంశాలను ఒకదానితో ఒకటి ముడి పెట్టి ప్రజలలో గందరగోళం సృష్టిస్తున్నారని, అవి పూర్తిగా వేర్వేరు విషయాలని స్పష్టం చేశారు.


మహిళల రిజర్వేషన్ బిల్లుకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ సీట్లలోనే 33 శాతం మహిళల రిజర్వేషన్‌ను యథాతథంగా వెంటనే అమలు చేయాలని, అన్ని రాష్ట్ర అసెంబ్లీల్లో కూడా అమలు చేయాలని కోరారు. మహిళల రాజకీయ సాధికారత కేవలం చట్టపరమైన మార్పు మాత్రమే కాదు, అది ప్రజాస్వామ్యానికి ఒక నైతిక అవసరమని పేర్కొన్నారు.
పునర్విభజనకు సంబంధించి గతంలో కూడా సీట్ల సంఖ్య పెంచకుండా కేవలం నియోజకవర్గాల సరిహద్దులను మార్చుతూ డిలిమిటేషన్ నిర్వహించినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా అలాంటి ప్రక్రియను చేపట్టవచ్చని తెలిపారు.
లోక్‌సభ సీట్లను 850కు పెంచే ప్రతిపాదన అసలైన వివాదాస్పద అంశమని పేర్కొన్నారు. ప్రస్తుత సీట్లను పెంచి వాటిని ప్రోరాటా పద్ధతిలో కేటాయించే ఆలోచనపై ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల రిజర్వేషన్‌కు పూర్తి మద్దతు ఇవ్వటంతో పాటు, సీట్ల సంఖ్య పెంపు లేకుండా డిలిమిటేషన్‌కు తాము పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు.
జనాభా లేదా ప్రోరాటా పద్ధతిలో లోక్‌సభ సీట్ల పెంపు ప్రతిపాదనను అనేక రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించబోవని తెలిపారు. ప్రోరాటా పద్ధతిలో అమలు చేస్తే దేశంలో తలెత్తబోయే పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాంతాల సమాన ప్రాతినిథ్యం దేశానికి అత్యంత కీలకమని సీట్ల పెంపుతో దక్షిణ రాష్ట్రాలపై పడే ప్రభావాన్ని కేంద్రం పూర్తిగా విశ్లేషించలేదని తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలు దశాబ్దాలుగా జనాభా స్థిరీకరణ, ఆరోగ్యం, మానవ అభివృద్ధి రంగాల్లో కృషి చేశాయని తెలిపారు. ఇవన్నీ జాతీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా చేపట్టిన చర్యలని గుర్తుచేశారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు నిధుల పంపిణీలో ఇప్పటికే పక్షపాతం, వివక్ష ఉన్నట్లు తెలిపారు. బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఎక్కువ నిధులు పొందుతుంటే, తెలంగాణకు తక్కువ నిధులు వస్తున్నాయని ఉదాహరణగా చెప్పారు. ఇది దక్షిణాది-ఉత్తరాది అసమానతకు సంకేతమని పేర్కొన్నారు.
నిధుల వివక్షకు అదనంగా ఇప్పుడు సీట్ల పెంపు కారణంగా రాజకీయంగా అన్యాయం జరుగుతుందని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా సహకరించినప్పటికీ, పార్లమెంట్‌లో వారి ప్రాధాన్యం తగ్గిపోతుందని, జనాభా పెరుగుదల ఎక్కువగా ఉన్న ఉత్తరాది-మధ్య ప్రాంత రాష్ట్రాలు లాభపడతాయని తెలిపారు.
అభివృద్ధిలో పాలుపంచుకున్న రాష్ట్రాలకు శిక్ష పడుతుందని, జనాభా పెరిగిన రాష్ట్రాలకు ప్రోత్సాహకంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇది అంకెల విషయం కాదని, దేశ సమగ్రత, సమానత్వం, న్యాయానికి సంబంధించిన ప్రాథమిక అంశమని స్పష్టం చేశారు.
దక్షిణ రాష్ట్రాలు జాతీయ ఆదాయానికి నిరంతరం సహకరిస్తూ, సుపరిపాలన, అభివృద్ధి ప్రమాణాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఈ కృషిని పట్టించుకోకుండా దేశ ఐక్యతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు.
ప్రోరాటా మోడల్‌ను దక్షిణ రాష్ట్రాలు అంగీకరించవని, ఈ అంశంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉత్పన్నమవుతుందన్నారు. అందరికీ న్యాయం జరిగేలా ఒక స్థిరమైన పరిష్కారం అవసరమని సూచించారు.
హైబ్రిడ్ మోడల్‌ ఒక ప్రత్యామ్నాయంగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అందరి ప్రాతినిధ్యంతో పాటు అన్ని రాష్ట్రాల సహకారాన్ని ఈ మోడల్ సమతుల్యం చేస్తుందని వివరించారు. సుప్రీంకోర్టు సూచించిన 50 శాతం– 50 శాతం విధానాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు.
హైబ్రిడ్ మోడల్ ప్రకారం, కొత్తగా పెంచే సీట్లలో సగాన్ని ప్రోరాటా పద్ధతిలో, మిగతా సగాన్ని రాష్ట్రాల ఆర్థిక భాగస్వామ్యం (GSDP), అభివృద్ధి ప్రమాణాల ఆధారంగా కేటాయించాలని సూచించారు.
స్వామి వివేకానంద గారు చెప్పినట్లుగా, మన ఆలోచనలకు తలుపులు తెరిచి కొత్త భావనలు స్వీకరిస్తే, ప్రజాస్వామ్య వ్యవస్థ మరియు ప్రక్రియ అందరికీ న్యాయంగా, ఆమోదయోగ్యంగా ఉండే ఉత్తమ పరిష్కారాన్ని కనుగొంటుందని పేర్కొన్నారు. హైబ్రిడ్ మోడల్ ద్వారా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు నష్టపోకుండా ఉండటంతో పాటు, ప్రజాస్వామ్య ప్రాతినిధ్య సూత్రం అమలవుతుందన్నారు.
ఈ అంశంపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపి, అన్ని రాష్ట్రాలు మరియు రాజకీయ పార్టీలతో కలిసి ఒక ఏకాభిప్రాయానికి రావాలని కోరారు.
భారతదేశ బలం భిన్నత్వంలో ఏకత్వమని, ఇలాంటి కీలక నిర్ణయాలు ఆ ఏకత్వాన్ని బలోపేతం చేసేలా ఉండాలని పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ అందరికీ న్యాయం చేసే పరిష్కారాన్ని కనుగొంటుందన్న ఆశాభావాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు

Related posts

అసలు ఎవరీ అర్లేకర్..?

అధికార, ప్రతిపక్షాలతో కమ్యూనిస్టుల దోస్తానా..?

రాజీనామా చెయ్యడానికి చంద్రబాబు’నో’ అన్నారా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More