సూపర్ హిట్ సినిమా ఓటీటీ (OTT) లో ఎందుకు కనిపించదు..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ హీరో హీరోయిన్లుగా.. యూత్, లవ్ ఎంటర్టైనర్గా 2011లో విడుదలైన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా ఏప్రిల్21కి పదిహేనేళ్ళ పూర్తిచేసుకుంది. దశరథ్ దర్శకత్వం లో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
దేవీశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఇప్పటికి చార్ట్ బస్టర్స్ లో అదిరిపోతోంది. కానీ సినిమా చూడాలంటే ఏ ఓటీటీ ప్లాట్ ఫాం లలో కనీసం యూట్యూబ్ లో కూడా లేకపోవడం ప్రేక్షకులను నిరాశకు గురిచేస్తోంది పెద్ద హిట్ అయిన మిస్టర్ పర్ఫెక్ట్ మాత్రం చూసే అవకాశం లేకపోవడం విచారకరమే.. అసలు ఈ సినిమా ఓటీటీ ల్లో ఎందుకు లేదు.. రీ రిలీజ్ ఎందుకు చెయ్యడం లేదు.? దీని వెనుక ఏదైనా వివాదం ఉందా..?
కాపీ రైట్ వివాదం కారణం గానే..
తను రచించిన ‘నా మనసు కోరింది నిన్నే’ అనే నవల ఆధారంగానే ‘మిస్టర్ పర్ఫెక్ట్’ (Mr Perfect) సినిమా తీశారంటూ రచయిత్రి ముమ్ముడి శ్యామలాదేవి 2017లో కేసు పెట్టారు. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా 2011లో విడుదలైనప్పటికి తాను అమెరికాలో ఉండటం వల్ల 2013లో టీవీలో ప్రసారం అవుతున్న సమయంలో చూశానని అప్పటి వరకూ తనకు కాపీ కొట్టారనే విషయం తనకు తెలియదని చిత్రంలోని ప్రతి పాత్ర తన నవల నుండి కాపీ కొట్టిందేనని అయితే విషయాన్ని చిత్ర నిర్మాత దిల్ రాజుకి తెలియజేయడానికి ప్రయత్నించినా ఆపాయింట్ మెంట్ ఇవ్వలేదని ఆరోపిస్తూ కాపీ రైట్ చట్టం కింద కేసు నమోదు చేసారు. అయితే దర్శకుడు దశరథ్ ఈ ఆరోపణలు ఖండించారు ‘శ్యామలా రాణి నవల 2010 ఆగస్టులో పబ్లిష్ అయితే మిస్టర్ పెర్ఫెక్ట్ కథను 2008లో ప్రభాస్ ‘బిల్లా’ సినిమా షూటింగ్ కోసం మలేషియాలో ఉన్నప్పుడు దిల్రాజు తో కలిసి వెళ్లి ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కథను నరేట్ చేసానని 2009 ఫిబ్రవరిలో ‘నవ్వుతో’ అనే టైటిల్తో సినీ రచయిత సంఘంలో రిజిస్టర్ చేసినట్లు చెప్పుకొచ్చారు దీనికి సంబంధించిన డాక్యుమెంట్ ని కూడా కోర్టుకు సమర్పించారు. కాఫీ కొట్టాము అనడంలో నిజం లేదని. నా కథ ఆమె నవల కన్నా ముందే ఉందని ఆయన అన్నారు.

టైటిల్స్ లో కధ క్రెడిట్ ఎవరిచ్చారు..?
మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రానికి స్టోరీ అందించానని అప్పట్లో చెప్తుకొచ్చి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మాత దిల్ రాజు కూడా మిస్టర్ పర్ఫెక్ట్ కధ తాము కాపీ కొట్టలేదని కోర్టుకు విన్నవించారు నిర్మాత కథ ఇచ్చినప్పుడు యూనిట్ పేరు వెయ్యడం ఆనవాయితీగా వస్తోందని అందుకే సినిమా టైటిల్స్ లో కథ శ్రీ వెంకటేశ్వర యూనిట్ వేసినట్లు చెప్పారు. ఈ చిత్రం కథ తన మనస్సులో చాలా కాలం నుంచీ ఉందని దర్శకుడు దశరధ్ తన దగ్గరకి వచ్చినప్పుడు ఆ ప్లాట్ చెప్పి డవలప్ చేయమన్నానని, అందుకే ఆ క్రెడిట్ యూనిట్ కే చెందాలని అలా పేరు వేసినట్లు కోర్టు కు వివరణ ఇచ్చారు. అయితే ఈ వివరణలు రచయిత్రి కొట్టిపారేశారు ఈ కథను రచయితల సంఘం లో 2009లోనే రిజిస్టర్ చేసినట్టు తప్పుడు డాక్యుమెంట్లు ఫోర్జరీ ఆధారాలు చూపించారని ఆమె వాపోయారు అనుమతి లేకుండా కాపీ చేసారని 30 సీన్లకు పైగా మక్కీకి మక్కీకి కాపీ చేసినట్లు ఆధారాలు అందించారు.. కథ రాయడానికి తనకు సంవత్సర కాలం పట్టిందని సినిమా చూసిన తరువాత జరిగిన నష్టానికి నష్టపరిహారం అడుగుతున్నట్లు వెల్లడించారు. 2019 జనవరిలో కోర్టు ఆదేశాల మేరకు 4117/ 2018 గా చార్జిషీట్ నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు దిల్ రాజుకు సమన్లు పంపించారు. అప్పటి నుండి కోర్టులో నలుగుతున్న కాపీ వ్యవహారం కేసు విచారణల అనంతరం ‘మిస్టర్ పర్ఫెక్ట్’ మూవీ ‘నా మనసు కోరింది నిన్నే’ నవలకు కాపీ అని హైదరాబాద్ సివిల్ కోర్టు నిర్ధారించి తీర్పు చెప్పింది. దీంతో ఆయనపై మాదాపూర్ పోలీసులు కాపీ రైట్ చట్టం కింద కేసు నమోదు చేశారు.

సుప్రీంకోర్టు కు..
సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పు ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సిటీ సివిల్ కోర్టు తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ల ద్విసభ్య ధర్మాసనం స్టే విధించింది. సినిమా 2011లో విడుదలైతే, రచయిత్రి 2017లో ఆరేళ్ల తర్వాత కేసు వేశారని, కాపీరైట్ చట్టం (Section 63) ప్రకారం పరిమితి కాలం (Limitation period) ముగిసిపోయిందని, కాబట్టి కేసు కొట్టివేయాలని దిల్ రాజు తరపు న్యాయవాది వాదించారు.
కోర్టు ఈ వాదనతో పూర్తిగా ఏకీభవించలేదు.ఈ సినిమా టీవీల్లో ఇతర వేదికల్లో నిరంతరం ప్రసారమవుతోంది. కాబట్టి ఇది నిరంతరంగా సాగే నేరం (Continuing Offense)గా పరిగణించవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది. ట్రయల్ కోర్టు చర్యలపై సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే విధించింది. అయితే, రచయిత్రికి కూడా నోటీసులు జారీ చేసి వివరణ కోరింది ఈ పిటిషన్పై మరోసారి విచారణ జరగనుంది.

వివాదానికి ఓటీటీలో మూవీ లేకపోవడానికి సంబంధం ఏంటి..?
సాధారణంగా ఏదైనా లీగల్ వివాదాలు (Legal Disputes) నడుస్తున్నప్పుడు, ఆ సినిమా డిజిటల్ లేదా శాటిలైట్ హక్కుల ప్రసారానికి సంబంధించి సహజంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మిస్టర్ పర్ఫెక్ట్ కి సంభందించి కథా చౌర్యం కేసు కోర్టులో చాలా కాలం పాటు నడిచింది. సినిమా చుట్టూ ఇలాంటి వివాదాలు ఉన్నప్పుడు స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లు చట్టపరమైన ఇబ్బందులలో తాము ఇరుక్కోకూడదని సినిమాలను కొనుగోలు చేయడానికి లేదా ప్రసారం చేయడానికి వెనుకాడుతుంటాయి.
అంతే కాకుండా మిస్టర్ పర్ఫెక్ట్ విడుదలైన సమయంలో (2011) ప్రస్తుతం ఉన్నంతగా ఓటీటీ హక్కుల మార్కెట్ లేకపోవడం తో అప్పుడు డిజిటల్ హక్కులను విక్రయించలేదు.ఓటీటీ మార్కెట్ వచ్చిన తరువాత దీనిపై వివాదం మొదలవ్వడంతో స్ట్రీమింగ్ హక్కుల విక్రయం నిలిచిపోయింది. ఈ సినిమా ప్రస్తుతం అధికారికంగా ఏ మేజర్ ఓటీటీ లలోను రచయిత్రి వేసిన కేసు కారణంగానే ఈ సినిమా కనిపించడం లేదు.
సుప్రీంకోర్టులో స్టే ఉన్నప్పటికీ, వివాదం ఇంకా పూర్తిగా సమసిపోలేదు. రచయిత్రికి కొంత పరిహారం ఇచ్చి కేసును వెనక్కి తీసుకునేలా రాజీ ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ చట్టపరమైన ప్రక్రియలు పూర్తిగా ముగిసి, “క్లియరెన్స్ సర్టిఫికేట్” వస్తే తప్ప ఈ సినిమా ఓటీటీలోకి రావడం కష్టమే. సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ సందర్భంగా చేసిన ముఖ్యమైన వ్యాఖ్య వలన వివాద పరిష్కారానికి కొంత అవకాశం ఉంది చర్చల ద్వారా (Out-of-court settlement) పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి అన్న సూచన ఉభయతారకం అవుతుంది. ఎందుకంటే ప్రభాస్ పాన్-ఇండియా స్టార్ అయినందున ఈ సినిమా డిజిటల్ హక్కులకు భారీ డిమాండ్ ఉంది. తుది తీర్పు వచ్చే వరకు చట్టపరంగా ఈ సినిమా కథ ఎవరిదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న గానే మిగిలిపోతుంది
