మహిళాబిల్లు విషయంలో భాజాపా ది వెనుకడుగా..? వ్యూహాత్మక ఎత్తుగడా..?

మహిళా రిజర్వేషన్ బిల్లు పునర్విభజన కు సంబంధించిన కీలక అంశాలతో 131 రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంటులో ఆశించిన మద్దతు లభించక వీగిపోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. బీజేపీ ది వ్యూహాత్మక వెనుకడుగా..? లేక రాజకీయ వ్యూహమా? అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాజ్యాంగ సవరణ బిల్లు వంటి కీలకమైన అంశం సభలో నెగ్గకపోవడం సాధారణంగా ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా అందరూ భావిస్తారు. కానీ, ప్రస్తుత రాజకీయ సమీకరణాలను పరిశీలిస్తే, దీని వెనుక అధికార బీజేపీ ఏదైనా లోతైన వ్యూహాన్ని అమలు చేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విపక్షాలను ఇరుకున పెట్టే ఎత్తుగడగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఈ బిల్లు వీగిపోవడానికి గల సాంకేతిక కారణాలను సాకుగా చూపిస్తూ, మహిళలకు అధికారం ఇవ్వాలని చూస్తుంటే, విపక్షాలు అడ్డుకున్నాయి అని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలని భావిస్తోంది. పోలింగ్ జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఇది ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకునే అవకాశం ఉందంటున్నారు.. బిల్లు ముందుగానే వీగిపోతుందన్న సంకేతం బీజేపీ కి ఉందని మహిళలకు అధికారం ఇవ్వాలనుకుంటే విపక్షాలు అడ్డుకున్నాయి అన్న ప్రచారం కోసమే అధికార బిజెపి హడావిడి గా ఈ బిల్లు తీసుకొచ్చిందంటున్నారు

మహిళను ఓడించి బీజేపీ గెలిచిందా..?

ఒక బిల్లు వీగిపోయినప్పుడు కలిగే సానుభూతిని ఓట్లుగా మలుచుకోవడంలో బీజేపీ గతంలోనూ చక్రం తిప్పిన చరిత్ర బీజేపీ కి ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తమకు పూర్తి మెజారిటీ ఉంటేనే ఇలాంటి విఘాతాలు ఉండవని మహిళలకు ఒక సందేశం ఇవ్వడానికే బిల్లు పెట్టారని అంటున్నారు. బిల్లు ద్వారా వచ్చే ప్రయోజనం కంటే, అది వీగిపోవడం వల్ల వచ్చే రాజకీయ మైలేజీపైనే ఆ పార్టీ దృష్టి పెట్టిందంటున్నారు.
ఓటింగ్ సమయంలో ఇండి కూటమి వైఖరిని ఎండగట్టడం ద్వారా వారిని ‘ప్రగతి నిరోధకులు’గా చిత్రీకరించడం తోపాటు ప్రస్తుత ఎన్నికల్లో లబ్ది పొందాలని భావిస్తోంది.
రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం అనేది కేవలం సంఖ్యాబలం లేకపోవడం వల్ల జరిగిన పొరపాటా? లేక విపక్షాలను ఆత్మరక్షణలో పడేయడానికి వేసిన ఎత్తుగడనా? అనేది రాబోయే రోజుల్లో బీజేపీ చేపట్టే ప్రచార సరళిని బట్టి స్పష్టమవుతుంది. ఏదేమైనా, పార్లమెంటరీ చరిత్రలో ఇది ఒక కీలక మలుపుగా మిగిలిపోనుంది.

విపక్షాల విజయం అన్న కలరింగ్ ఇచ్చి వాళ్ళ వేలితోనే వారి కళ్ళు పొడుచుకునేలా చెయ్యడం లో బీజేపీ
సక్సెస్ అయిందనే చెప్పొచ్చు బీజేపీ ఉచ్చు లో పడ్డ ఇండియా కూటమి సమర్ధించుకోవాలో లేక దక్షిణాది రాష్ట్రాలకు చెందిన విపక్ష పార్టీలు, డీలిమిటేషన్ అంశంపై కేంద్రాన్ని నిలదీయడం ద్వారా తమ ప్రాంతీయ ప్రయోజనాలను కాపాడిన ‘ఛాంపియన్లు’గా ప్రజల దృష్టి లో ఉండాలో తెలియని పరిస్థితి.
విపక్షాలు దీనిని విజయం అని సంబరపడుతుంటే, బీజేపీ ప్రగతి నిరోధకులుగా వేసే ముద్ర విపక్షాలకు నష్టం చేకూర్చవచ్చు.
మహిళా ఓటర్లలో “వీరి వల్లే మాకు రావాల్సిన రిజర్వేషన్లు ఆగిపోయాయి” అనే భావన కలిగించేలా బీజేపీ ప్రతి రోడ్ షో లలో చెప్పే అవకాశం ఉంది. ఈ ప్రచారం ఎంతవరకు సక్సెస్ అయింది. ఎంత వరకు ఓడిపోయింది అన్నది మే నాలుగున స్పష్టం కానుంది. రాజకీయాల్లో ఎవరు గెలిచారు? అనేది సభలో జరిగే ఓటింగ్ కంటే, ప్రజల మెదళ్లలో ఎవరు ఏ ముద్ర వేశారు అనే దానిపైనే ఈ వ్యూహం ఆధారపడి ఉంటుంది.

Related posts

అసలు ఎవరీ అర్లేకర్..?

అధికార, ప్రతిపక్షాలతో కమ్యూనిస్టుల దోస్తానా..?

సౌత్ లో కమల వికాసం కష్టమా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More