నార్త్ ఈస్ట్ వెస్ట్ అన్న తేడా లేకుండా అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న భారతీయ జనతా పార్టీ దక్షిణం లో పాగా వేయడానికి నానాపాట్లు పడుతూనే ఉంది. మేనియాలు, మానియాలు, రాజకీయ వ్యూహాలు, అపర చాణిక్యాలు, ఇక్కడి ప్రాంతీయ అంశాల ముందు తెలిపోతున్నాయని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తూనే ఉన్నాయి. కర్నాటక ,తెలంగాణ లో మాత్రం విజయానికి ఓ మోస్తరు ఆనవాళ్లు కనపరుస్తున్న బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దిశ విజయాలు మాత్రం సాధించలేకపోతోంది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న బీజేపీ కేరళం, తమిళనాడు బొక్క బోర్లా పడింది అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రభుత్వ వ్యతిరేకత ను బీజేపీ కూటమి ఓటు గా మలచుకోలేకపోయింది. పొత్తు పెట్టుకున్న పార్టీ కోసం అంతవరకు కష్ట పడ్డ నేతలను దూరం పెట్టడం, గెలుపు గుర్రాలను వదులుకోవడం కేవలం అనుకూల మీడియా విశ్లేషణలనే ప్రామాణికంగా తీసుకొని గుడ్డిగా ముందుకు వెళ్లడం ఇలాంటి లెక్కించదగ్గ కారణాలతో ప్రజలు బీజేపీ కూటమిని స్పష్టంగా తిరస్కరించారు. ఏఐఏడీఎంకే వలన బీజేపీకి మైనస్ అయిందో బీజేపీ వలన ఏఐఏడీఎంకే కి కోత పడిందో తెలియదు గాని జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది. ఇక్కడ దక్షిణాది నాయకులు ఆరోపిస్తున్నట్లుగానే బీజేపీ నార్త్ పార్టీ అన్నదే నిజమని నిరూపించే ఫలితాలను ప్రజలిస్తున్నారు.
అలాగే కేరళం లో కొన్ని సీట్లు గెలుచుకున్నా, ప్రధాన పార్టీ గా ఎదిగే స్కోప్ లేకుండా పోయింది. నిజానికి సౌత్ లో ఎక్కువ అవకాశం ఉండే రాష్ట్రం కర్ణాటక
ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికి ఇంకా అక్కడ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు చేసే ప్రయత్నాలు తప్పటాడుగుల్లాగే ఉంటున్నాయి. ఇక అత్యంత కీలకమైన తెలంగాణ లో బీజేపీ ఇంకా ప్రయోగాలు చేసే స్థితి లొనే ఉంది. ఇక్కడ కూడా కష్టపడే నాయకుల్ని చరిష్మా ఉన్న నేతల్ని పక్కన పెట్టి జనామోదం లేని నేతలకు కీలక బాధ్యతలు అప్పగించడం ఆ పార్టీ ని అభిమానించే వారికి మింగుడు పడని అంశంగా మారింది. కష్ట కాలం లో కాంగ్రెస్ కు కలిసొచ్చిన రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు బీజేపీ కి ఇప్పుడు తెలంగాణ లో అత్యవసరం. రాజకీయాలు చేసే వ్యక్తులు కాకుండా పార్టీ కోసం, వ్యవస్థ కోసం పనిచేసే నేతలను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే కొద్దో గొప్పో అవకాశం ఉన్న తెలంగాణ, కర్ణాటక లలో అధికారం వైపు గా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. కాదుకూడదు అని ముందుకెళ్తే దక్షిణాది ప్రజలు బీజేపీని ఆమోదించడం లేదని ఫిక్స్ అవ్వాల్సి ఉంటుంది. సౌత్ లో కమల వికాశం కావాలంటే తన వ్యూహాలను మార్చుకుని ముదుకెళ్లాలి. విజయావకాశాలు ఎక్కువున్న రాష్ట్రాలపై కచ్చితమైన దృష్టి పెట్టాలి పార్టీ ని, పార్టీ విధానాలను గౌరవించే నేతలను మళ్లీ కలుపుకోవాలి లేకపోతే సౌత్ బీజేపీ కి ఎప్పటికి దూరంగానే ఉంటుంది నార్త్ పార్టీ గానే మిగిలి పోతుంది.