ఇండీ కూటమి సెంటిమెంట్ రాజకీయం

ఇండికూటమికి దెబ్బలు కామన్ అయిపోయాయి. ఓట్ల చోరీ వ్యవహారంతో దేశాన్ని ఉలిక్కిపడేలా చేసేస్తామనుకున్న వాళ్లే ఓట్ల చోరీ వ్యవహారం యూ టర్న్ తీసుకోవడం తో చివరికి బెదిరిపోయి రాహుల్ టీం ఇప్పుడు తలచినదే జరిగిందా దైవం ఎందులకు అని రాగం అందుకుంటున్నారు. అధికారికంగా కాంగ్రెస్ పార్టీఅధ్యక్ష పదవి స్వీకరించడానికి మీనమేషాలు లెక్క పెట్టుకున్న రాహుల్ గాంధీ వివాదాలను నమ్ముకుని ముందుకు దూసుకెళ్తున్నారు. జగదీప్ ధన్ఖడ్ ఉపరాష్ట్రపతిగా రాజీనామా చేసిన తర్వాత దాన్ని వివాదం చేయాలని తలచి బోర్లా పడ్డ విషయం విదితమే. రాజీనామా వ్యవహారాన్ని ఎలాగూ రాజకీయం చేయలేకపోయాం.. కనీసం ఎన్నికనైన రాజకీయం చేస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచనతో వ్యూహాలు మొదలుపెట్టారు. భారతీయ జనతా పార్టీ ఈసారి దక్షిణాదిపై ఫోకస్ చేసిన దరిమిలా ముఖ్యంగా వచ్చే తమిళనాడు ఎన్నికల దృష్ట్యా అక్కడి నుంచే అభ్యర్థి నిలపాలని తలచింది. ఆ వ్యూహాలు లెక్కలతో ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణన్ ను అభ్యర్థిగా ప్రకటించింది. కూటమి భాగస్వామ్య సభ్యులు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఆయన గెలుపు సునాయాసం అయినా సరే బిజెపి అగ్రనేతలు విపక్ష పార్టీలనేతలను న్యూట్రల్ గా ఉన్న పార్టీ నేతలతో సంప్రదింపులు మొదలుపెట్టారు. కొందరు దానికి సై అంటే.. మరి కొంతమందిని నై అని చెప్పేస్తున్నారు. ఓటమి పక్కా అని తెలిసినా కూడా ఇండికూటమి అభ్యర్థి నిలిపింది. ప్రజాస్వామ్యంగా పోటీ చేయడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు దాన్ని ఎవరూ కాదనలేరు. సరిగ్గా ఇక్కడే ఇండికూటమి నేతలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ రాజకీయానికి తెరలేపింది.

రాధాకృష్ణన్ కు ప్రత్యర్థిగా దక్షిణాది నుంచి అదికూడా తెలుగు ప్రాంతం నుంచి అభ్యర్థి గా ప్రకటించింది. అసలైన స్క్రీన్ ప్లే ఇక్కడే మొదలుపెట్టింది. తెలుగువాడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి తెలుగువారిగా మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పలికించింది. కొన్ని మీడియా సంస్థలు అయితే అత్యుత్సాహంతో ఎన్డీఏ కూటమి చంద్రబాబుకు హ్యాండ్ ఇవ్వబోతున్నాడని ఎన్ డి ఏ కూటమికి చంద్రబాబు హ్యాండ్ ఇవ్వబోతున్నాడని తెలుగు అభ్యర్థికే మద్దతు ఇవ్వనున్నారని.. ఆ షాక్ లో బిజెపి ఉందని టెరిఫిక్ థంబ్ నైల్స్ తో కథనాలుగా వండి వార్చేసారు. ఎన్డీఏ కూటమిలో ఉండి అభ్యర్థి ఎంపిక లో కీలకంగా ఉన్న చంద్రబాబు నాయుడు అసలు ఎందుకు బిజెపికి ఎదురు తిరుగుతారు అన్న కనీస కామన్ సెన్స్ లేకుండా పాత్రికేయుల ముసుగులో వార్తలు పెట్టేశారు ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు కూడా తెలుగు వ్యక్తి అయినంత మాత్రాన ప్రత్యర్థి పార్టీకి ఎందుకు మద్దతిస్తామని ప్రశ్నించారు గెలిచే అవకాశం ఎంత మాత్రం లేనప్పుడు అసలు పోటీ పెట్టడాన్నే తప్పు పట్టారు ఆనాడు నంద్యాలలో పివికి మద్దతు ఇచ్చిన అంశాన్ని ప్రస్తావిస్తూ అప్పుడు తెలుగు వారి గౌరవంతో అది ముడిపడి ఉండటం వలన పీవీ పై పోటీ పెట్టలేదని చెప్పుకొచ్చారు.

తెలుగు రాష్ట్రాల రాజకీయం ఇలా ఉంటే తమిళనాడులో డిఫరెంట్ రాజకీయం జోరు అందుకుంది తమిళ వ్యక్తిని పోటీకి నిలిపి అధికార డిఎంకె కు ఝలక్ ఇచ్చిన బిజెపి వచ్చే ఎన్నికలకు వ్యూహాత్మకం గా తొలిఅడుగు వేసిందని రాజకీయ పండితులు అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాతావరణం కి కంప్లీట్ వ్యతిరేకంగా తమిళ్ సెంటిమెంట్ ను అక్కడి నేతలు రాజేస్తున్నారు. అధికార డిఎంకెలో దీనిపై భిన్నాభిప్రాయాలు గట్టిగానే వినిపిస్తున్నాయి తమిళ వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వాదిస్తుంది. ఇండీ కూటమి తెలుగు వ్యక్తి ని కాకుండా తమిళ్ వ్యక్తి ని ఎంపిక చేస్తే బాగుండేదని నేతలు లోలోపల తెగ మదన పడిపోతున్నారట.. భాషాభిమానంతో టాప్ గేర్ లో దూసుకుపోయే తమిళనాడుకు ఈ పరిణామం స్పీడ్ బ్రేకర్ గా మారింది. ఆత్మ సాక్షిగా అనుగుణంగా ఓటింగ్ జరిగితే తమిళనాడు నుంచి భారీ ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దక్షిణాదిలో రెండు భాష ల మధ్య చిచ్చు పెట్టాలనుకున్న కాంగ్రెస్ ప్రయత్నం తీవ్రమైన నిరాశ కు గురి చేయడం ఖాయమని వారంటున్నారు.

Related posts

రాగాలు తీసే రహదారి

స్పై వేర్ అంటే ఏంటీ..? సుప్రీంకోర్టు ఎందుకు దాన్ని సమర్థిస్తోంది..!

చంద్రబాబే నంబర్ వన్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More