భోగాపురం ఎయిర్ పోర్ట్ ఘనత కోసం అధికార విపక్షాల లొల్లి.
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం లో చిట్ట చివరి ట్రయిల్ లో భాగంగా 3.8 కిలోమీటర్ల అతిపెద్ద రన్ వే పై విమానం ఇలా వాలిందో లేదో.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు క్రెడిట్ గోల తో వేడెక్కాయి. మూడు జిల్లాలను అనుసంధానిస్తూ విమానాశ్రయాన్ని నిర్మించిన క్రెడిట్ తమదేనంటూ టీడీపీ-వైసీపీ మధ్య ‘క్రెడిట్ వార్’ మొదలైపోయింది. ఆయా పార్టీల నేతలు గ్రౌండ్ లెవల్ నుంచి స్టేట్ లెవల్ వరకూ ప్రెస్మీట్లు స్టేట్మెంట్ లతో ఊదరగొట్టేస్తున్నారు.
విశాఖపట్నం కు 44, విజయనగరం కు 23, శ్రీకాకుళం కు 64 కిలోమీటర్ల దూరంలో ఉత్తరాంధ్ర తో పాటు ఓడిశా రాష్ట్రానికి అనుసంధానిస్తూ నిర్మితం అవుతున్న ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ చిట్ట చివరి ట్రయిల్ రన్లో భాగం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో డిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఫ్లయిట్ కొంత మంది వీఐపీ లతో పాటు వివాదాలను కూడా మోసుకొచ్చింది. భోగాపురం ఎయిర్పోర్ట్ సాకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ అని టీడీపీ చెబుతుంటే, విమానాశ్రయ నిర్మాణ క్రెడిట్ ను కొట్టేయడానికే టీడీపీ గొప్పలు పోతుందని క్రెడిట్ చోరీ చంద్రబాబు కు అలవాటేనని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.
మే3 2023 లో శంకుస్థాపన చేసిన జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే అసలైన భూసేకరణ, కోర్టు వివాదాల పరిష్కారం జరిగాయని వైసీపీ వాదిస్తోంది. ప్రాజెక్ట్ 80% పైగా పనులు తమ హయాంలోనే పూర్తయ్యాయని, అందుకే దీని క్రెడిట్ జగన్కే దక్కుతుందని వారు అంటున్నారు.భూసేకరణపై వివాదాలు వచ్చిన నేపథ్యంలో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు పార్టీలు పరస్పరం విమర్శించుకున్నాయి అంతటి తో ఆగకుండా నలబై అయిదు కిలోమీటర్ల పరిధి లో మరో విమానాశ్రయం ఎందుకు..? అని ప్రశ్నించడమే కాకుండా తాము అధికారంలోకి వస్తే సేకరించిన భూమి తిరిగి రైతులకు ఇచ్చేస్తామని ఎర్రబస్సు కూడా రాని ఏరియాకు ఎయిర్ బస్సు ఎందుకు.? అని ప్రశ్నించి న వైసీపీ కి ఎయిర్ పోర్టు గురించి మాట్లాడే హక్కు లేదని టీడీపీ నాయకులు అంటున్నారు. నిజానికి 2015లోనే దీనికి ప్రతిపాదనలు సిద్ధం చెయ్యగా జనవరి 2016లో కేంద్రం సైట్ క్లియరెన్స్ ఇచ్చింది. అదే ఏడాది మే లో పర్యావరణ అనుమతులు వచ్చాయి. అక్టోబరు న కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చింది. 2703 ఎకరాల భూసేకరణ వివిధ దశలలో పూర్తి కాగా రైతులు భూములు ఇవ్వడానికి వైసీపీ అడ్డుపడింది. అనుమతులు రావడంలో అప్పటి కేంద్ర విమానయాన మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజు పాత్ర చాలా ఎక్కువ. శంకుస్థాపన తరువాత వైసిపి హయం లో అస్సలు జరగని పనులను కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే పరుగులు పెట్టించామని టీడీపీ నేతలు అంటున్నారు. మాజీ కేంద్రమంత్రి ప్రస్తుత గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కుటుంభం దాదాపు వెయ్యకోట్ల విలువైన భూములను ఎయిర్ పోర్టు నిర్మాణానికి ఉచితం గా ఇచ్చారని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్ పోర్ట్ కి అన్ని వేల ఎకరాలు ఎందుకు? అని ప్రశ్నించిన వీడియోలను ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటే మరోవైపు భూములు ఇచ్చిన రైతులకు సరైన పరిహారం ఇవ్వలేదని, తమ హయాంలోనే రూ. 960 కోట్లు ఖర్చు చేసి రైతులకు న్యాయం చేశామని వైసీపీ నేతలు పేర్ని నాని, బొత్స సత్యనారాయణ గుడివాడ అమర్నాధ్ వంటి వారు చెప్తున్నారు. ‘జీఎంఆర్’ (GMR) టెండర్ల మార్పు లో కూడా వైకాపా రాజకీయం చేసి తమ హయాంలో ఖరారైన టెండర్లను రద్దు చేసి ‘రివర్స్ టెండరింగ్’కు వెళ్లిందని అయితే, చివరకు మళ్ళీ జీఎంఆర్ (GMR) సంస్థకే కాంట్రాక్ట్ దక్కడం వైసీపీ ప్రభుత్వం గందరగోళం తో ప్రాజెక్ట్ రెండు మూడేళ్లు ఆలస్యమైందని టీడీపీ విమర్శిస్తుంది. క్రెడిట్ గోల ఎలా వున్నా ఎయిర్పోర్ట్కు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ఒక చారిత్రాత్మక నిర్ణయమని, సమంజసం అని ప్రజలు భావిస్తున్నారు. అతిపెద్ద రన్ వే పై A380, బోయింగ్747,8 వంటి భారీ విమానాలు ఇక్కడ అత్యంత సులభం గా ల్యాండ్ అయ్యే ఈ విమానాశ్రయం మొదటి దశ లో 60 లక్షలమంది, చివరి దశ నాటికి 1.8కోట్ల మంది ప్రయాణికులు ఈ ఎయిర్ పోర్ట్ నుంచి తమతమ గమ్యస్థానాలకు చేరనున్నారు. ఉత్తరాంధ్ర గ్రోత్ ఇంజన్ గా మారనున్న ఈ ఎయిర్ పోర్ట్ ను జూన్ లో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.