పాత సామాన్లకు కొత్త వస్తువులు ఇవ్వబడును మధ్యతరగతి బడుగు వర్గాలకు వినిపించే తీపి ప్రచారం.. వారిని బుట్టలో వేసుకునే అతిపెద్ద వ్యాపార తంత్రం..! పాత వస్తువు పోయి కొత్త వస్తువు వస్తుంది కదా మనకే లాభం అన్న సైకాలజీ ని బేస్ చేసుకుని నేరగాళ్లు కొత్త ఎత్తుగడ మొదలుపెట్టారు. పాత సామానులు, చిక్కు వెంట్రుకలు, పాత బట్టలు ఇలా రకరకాల వ్యాపారాలు.. ఇప్పుడు పాత ఫోన్లు కొంటాం.. అది పాడైపోయినా విరిగిపోయినా కొంటాం. అంటూ పెద్ద ఎత్తున వీధుల్లో తిరుగుతున్నారు ముసుగు వేసుకున్న నేరగాళ్లు.. పనికిరాని వాటికి కూడా ఇంత లాభమా..? అని మురిసిపోతే మాత్రం .. మనం ప్రమాదంలో పడినట్లే! పాత మొబైల్స్ వ్యాపారం వెనుక ఉన్న కుట్రను పోలీసులు బయటపెట్టారు. యూ పీ , బీహార్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో ఘోరమైన నిజాలు బయటపడ్డాయి. వీధుల్లో తిరుగుతూ సామాను కొనేవారిలా ఇంట్లో ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ డీల్ లో పనికిరానిదే కదాని స్టీల్ ప్లాస్టిక్ డబ్బాలకి అమ్మేసే ఫోన్ మన కొంప కొల్లేరు చేసేస్తోంది.
మొబైల్ ఫోన్ పూర్తిగా పాడైపోయినా, విరిగిపోయినా దానిలోని ‘మదర్బోర్డ్’ లోని ROM సురక్షితంగానే ఉండి మన ఫోటోలు, పాస్వర్డ్లు, బ్యాంక్ వివరాలు అన్నీ అందులో సేవ్ అయిఉంటాయి. చైనా, బంగ్లాదేశ్ లకు చెందిన ప్రమాదకరమైన సైబర్ నేరగాళ్ల ద్వారా మదర్బోర్డులు కంబోడియా, మలేషియా, మయన్మార్ వంటి దేశాలలో ఉన్న సైబర్ స్కామ్ కాంపౌండ్స్కు తరలిపోతున్నాయి. వాటిని అత్యాధునిక సాఫ్ట్వేర్ ఉపయోగించి మీ పాత మదర్బోర్డుల మీది ROM నుంచి డిలీట్ చేసిన డేటాను కూడా రికవరీ చేసి సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తారు. మనం పనికిరాదు అనిపడేసిన పాత ఫోన్ ఇప్పుడు దేశ భద్రతకు ఒక పెద్ద సవాలుగా మారింది.
ఈ స్కాం అసలెలా బయటపడింది..?

గత నెల ఉత్తర ప్రదేశ్లోని మిర్జాపూర్ జిల్లా లాల్గంజ్ పోలీసులు ఒక అనుమానాస్పద ట్రక్కు ను అదుపులోకి తీసుకుని సెర్చ్ చేస్తుంటే అందులో ఏకంగా 11,605 పాత మొబైల్ ఫోన్లు ఉన్నాయి. వీటి విలువ దాదాపు కోటి రూపాయల పైమాటే! ఆ ట్రక్కులో ఉన్నవారిని అదుపులోకి తీసుకుని విచారిస్తే ‘ఇస్తార్ ఆలం అనే వ్యక్తి పేరు బయటకు వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన బీహార్ STF మరియు UP పోలీసులు సంయుక్తంగా రైడ్ చేసి, కటిహార్లో అదుపులోకి తీసుకున్న ఇస్తార్ చెప్పిన మేటర్ పోలీసులను షాక్ కి గురిచేసింది. బీహార్లోని కటిహార్ ప్రాంతానికి చెందిన “ ఇస్తార్ ఆలం “ మొబైల్ షాపు నడుపుతుండేవాడు. బయటి ప్రపంచానికి సామాన్య వ్యాపారిలా కనిపించిన ఆలం అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లకు వ్యక్తిగత డేటాను దొంగిలించి, మీ బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసే ఒక భారీ నెట్వర్క్ను నడుపుతున్న ఈ నేరగాడు. బీహార్, జార్ఖండ్, ఢిల్లీ, తమిళనాడు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ఈ తరహా వ్యాపారం మొదలుపెట్టి జనాలను బురిడీ కొట్టిస్తున్నట్లు పోలీసు విచారణ లో తెలిపాడు. తేలిందేమిటంటే, ఒక సామాన్య దినసరి కూలీగా చెప్పుకునే గ్యాంగ్ మెంబర్ బ్యాంక్ ఖాతా లో గత రెండేళ్లలో అందులో 45 లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్టు పోలీసులు వెల్లడించారు.
వీధిలో తిరిగే పాత్రల వ్యాపారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పాత స్మార్ట్ఫోన్లను అమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఫోన్ అమ్మాల్సి వస్తే, కొనుగోలు చేసే వ్యక్తి ఆధార్ కార్డు లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డును తప్పనిసరిగా తనిఖీ చేయాలని అలాగే ఫోన్ అమ్మినట్టుగా తేదీ మరియు IMEI నంబర్తో కూడిన రసీదు తీసుకోవాలని చెప్పారు. అంతే కాకుండా ఫోన్ అమ్మే ముందు డేటాను పూర్తిగా డిలీట్ చేసి ‘ఫ్యాక్టరీ రీసెట్’ చేయాలని చెప్పారు.
