Vaisaakhi – Pakka Infotainment

చాయ్ కహానీ తెలుసుకో భాయ్..

ఇండియాకు ఎలా వచ్చింది ?

హే చాయ్ చటుక్కున తాగరా బాయ్… అని పాడుకుంటూ మనోళ్లు టీ తాగడం లో ప్రపంచం తో పోటీ పడుతున్నారు. కాస్త తలనొప్పిగా వున్నా… కొద్దిగా అనీజీ గా ఉన్న ఓ మంచి టీ తాగితే చాలు ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది మనోళ్ళకి బ్రిటీషోళ్ళు మార్కెటింగ్ చేసిన టీ కి ఫిదా అయిన భారతీయులు ఆ ఒరవడి ని ఇప్పటికి కంటిన్యూ చేస్తున్నారు. చారిత్రక ఆధారాల ప్రకారం భారతదేశంలో టీ తాగే అలవాటు క్రీ.పూ. 750 నాటికే ఉంది. భారతదేశంలో టీ (తేనీరు) చరిత్రను రెండు రకాలుగా చూడాలి. ఒకటి మన దేశంలో సహజంగా పెరిగిన తీరు, రెండోది వ్యాపారపరంగా ప్రసిద్ధి చెందిన తీరు. బ్రిటిష్ వారు రాకముందే, మన దేశంలో అస్సాం ప్రాంతానికి చెందిన సింగ్‌ఫో (Singpho) అనే గిరిజన తెగ టీ ఆకులను ఔషధంగా, పానీయంగా సేవిస్తూఉండేవారు. అడవిలో సహజంగా పెరిగే టీ మొక్కల నుంచి ఆకులను సేకరించి, వాటిని ఎండబెట్టి నీటిలో మరిగించి తాగేవారు. అంతకు పూర్వమే ఒక ఇతిహాస కథనం ప్రకారం, బోధిధర్మ అనే భారతీయ బౌద్ధ సన్యాసి ధ్యానం చేసేటప్పుడు నిద్ర రాకుండా ఉండటానికి టీ ఆకులను నమిలేవారని, ఆయన ద్వారానే చైనాకు టీ వెళ్లిందని కూడా చెబుతుంటారు.

భారతదేశంలో టీ మొక్కలు సహజంగానే ఉన్నాయి ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో టీ ఉత్పత్తి అధికం దక్షిణాన నీలగిరి కొండలు కూడా టీ సామ్రాజ్యం గా తనదైన ముద్రవేసినప్పటికి ఒక సామాన్య పానీయాన్ని వ్యాపార పంటగా పెద్ద పరిశ్రమగా మార్చింది మాత్రం బ్రిటిష్ వారే 1823 లో రాబర్ట్ బ్రూస్ (Robert Bruce) అనే బ్రిటిష్ అధికారి అస్సాం పర్యటనలో సింగ్‌ఫో తెగ వారు తాగుతున్న పానీయాన్ని గమనించి అక్కడ టీ మొక్కలు సహజంగా పెరుగుతున్నాయని ప్రపంచానికి చాటిచెప్పారు. ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పట్లో బ్రిటన్ చైనా నుండి టీని దిగుమతి చేసుకునేది. చైనాపై ఆధారపడటం తగ్గించుకోవడానికి, బ్రిటిష్ వారు 1830ల కాలంలో అస్సాం, డార్జిలింగ్ ప్రాంతాల్లో టీ తోటలను భారీగా పెంచడం ప్రారంభించారు అడవులు నరికి భారీ టీ తోటలు వేశారు. 1850లలో డార్జిలింగ్‌లో, ఆ తర్వాత అసోం మైదానాలలో, చివరకు 19వ శతాబ్దం చివరలో నీలగిరిలో టీ తోటలు ఏర్పడ్డాయి.

బ్రిటిష్ వారి ప్రచారమే కారణం

తేయాకు ఉత్పత్తి పెరిగిన తరువాత గుర్రపు బండ్లపై ఉచిత టీ ని భారతీయులకు పంచిపెట్టారు. 1907 నాటికే బ్రూక్ బాండ్ కంపెనీ ద్వారా పాలు, చక్కెరతో టీ తాగే అలవాటు మొదలైంది. బ్రిటిష్ వారు కర్మాగారాలలో, కార్యాలయాలలో టీ బ్రేక్ అనే పద్ధతి ప్రవేశపెట్టి బలవంతంగా అలవాటు చేశారు. చాయ్‌వాలాలు రోడ్డు పక్కన స్టాల్స్ వేసి చవగ్గా అమ్మడం మొదలు పెట్టారు. మొదట్లో బ్రిటిష్ వారి టీ ప్రచారం చాలా తెలివిగా ఉండేది, “టీ తాగితే బ్రిటిష్ లక్షణాలైన చురుకుదనం, శక్తి, సమయపాలన వస్తాయి” అని ప్రచారం చేశారు.

మొదట్లో రైల్వేస్టేషన్స్, సంతలు, జాతరలు, ఉత్సవాలలో చాయ్ ని ఉచితంగా ఇచ్చేవారు. ఇంకా జాతీయ సమైక్యత కోసం “జాతీయ పానీయం” అని కూడా వారు ముద్ర వేశారు.మొదట్లో టీ కేవలం ఎగుమతికే ఉండేది. ఉత్పత్తి పెరిగి ధర తగ్గాక భారతీయులు దాన్ని తాగడం మొదలుపెట్టారు. బ్రిటిష్ వారిలా పాలు, చక్కెర కలిపి తాగడం అలవాటైంది.భారతీయులు తమ రుచికి తగ్గట్టుగా అల్లం, యాలకులు, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలు కలిపి “మసాలా చాయ్” తయారుచేసుకున్నారు. ఇది పూర్తిగా భారతీయుల క్రియేషన్.
గాంధీజీ బ్రిటిష్ వస్తువుల బహిష్కరణలో భాగంగా టీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పటికి స్వాతంత్ర్యం అనంతరం టీ జాతీయ సమైక్యత చిహ్నంగా మారింది.నేడు భారతదేశం కాఫీ కంటే 15 రెట్లు ఎక్కువ టీ వినియోగిస్తుంది. ప్రతి వీధిలో టీ స్టాల్ భారతీయ సంస్కృతిలో భాగమయింది. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రిటిష్ వారు వ్యాపార స్వార్థంతో తెచ్చిన టీ, భారతీయుల చేతుల్లో “చాయ్” అనే అమృతంగా మారిపోయింది! మన కషాయాల స్పూర్తితో వంటశాల లో దొరికే అనేక పదార్ధాలతో రకరకాల టీలు పుట్టుకొచ్చాయి. ఆకులు , మూలికలు, దుంపలు, చూర్ణాలు, పువ్వులు ఇలా అన్నీ టీ కి మూలపదార్ధాలుగా మారాయి.

ప్రపంచ మార్కెట్ లో మన వాటా ఎంత..?

ప్రపంచ టీ మార్కెట్‌లో ఉత్పత్తి, వినియోగం, ఎగుమతుల్లో భారతదేశం అగ్రస్థానం లో కొనసాగుతుంది. 2025-26 తాజా గణాంకాల బట్టి ప్రపంచ మార్కెట్‌లో
ఉత్పత్తి (Production) విషయంలో భారతదేశ వాటా సుమారు 18% నుండి 23% గా ఉంది. చైనా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద టీ ఉత్పత్తిదారుగా భారత్ కొనసాగుతోంది. అలాగే ఎగుమతులు (Exports) విషయానికి వస్తే 10% నుండి 12% వాటాతో కెన్యా, చైనా, శ్రీలంక తర్వాత భారత్ ప్రపంచవ్యాప్తంగా 4వ స్థానంలో ఉంది. ఇక వినియోగం (Consumption) విషయానికి వస్తే ప్రపంచంలోనే అత్యధికంగా టీని వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. మనం పండించే టీ పంట లో సుమారు 80% స్వదేశీ అవసరాలకే సరిపోతుంది.
మనదేశంలో అస్సాం, పశ్చిమ బెంగాల్ (డార్జిలింగ్), తమిళనాడు (నీలగిరి) లలో పండించే తేయాకు
మార్కెట్ విలువ సుమారు $12 బిలియన్లు అంటే లక్ష కోట్లకు పైమాట 2025లో భారతదేశపు ఎగుమతులు రికార్డు స్థాయిలో 280 మిలియన్ కిలోలకు చేరుకున్నాయి. ముఖ్యంగా మన దేశానికి చెందిన ‘డార్జిలింగ్ టీ’ ప్రపంచవ్యాప్తంగా “Champagne of Teas”గా మంచి గుర్తింపు అందుకుంది.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More