Vaisaakhi – Pakka Infotainment

ఆ పేర్లు కనుమరుగా..? కొనసాగింపా.?

సర్క్యూలేట్ అవుతున్న కొత్త జిల్లాల లిస్ట్ లో కనపడని ఆ పేర్లు..!
విభజిత ఆంధ్రప్రదేశ్ లో పదమూడు జిల్లాలుగా ఉన్న వాటిని
గత వైసిపి ప్రభుత్వం వికేంద్రీకరణ చేసి 26 జిల్లాలుగా మార్చింది. కొన్ని జిల్లాల సరిహద్దులు మార్చి మరికొన్నిటిని కలిపి కొత్త జిల్లాలకు రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తిరిగి జిల్లాల వికేంద్రీకరణ జరుపనున్నట్లు ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించి ముప్పై రెండు జిల్లాలతో కూడిన ఓ లిస్టు ఒకటి ప్రస్తుతం సర్కులేట్ అవుతోంది. ప్రతిపాదిత ముప్పై రెండు కొత్త జిల్లాలు, వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలు ఆ లిస్టులో ఉన్నాయి.

ప్రస్తుతం ఇరవై ఆరు జిల్లాలుగా ఉన్నవాటిలో అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా, శ్రీ సత్య సాయి జిల్లా, ఇలా కొంతమంది వ్యక్తుల పేర్లతో వారి గౌరవార్థం జిల్లాలు ఏర్పాటు జరిగింది. అయితే ఇప్పుడు ప్రచారంలో ఉన్న జిల్లాల్లో ఈ పేర్లు కనిపించక పోవడం పై ఆ పేర్లు ఆయా జిల్లాలకు ఉంటాయా..? ఉండవా..? అన్న సందిగ్ధం ఏర్పడింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఆయన మరణానంతరం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడప జిల్లాకు వైఎస్ఆర్ పేరు పెట్టడం జరిగింది. రాష్ట్ర విభజన అనంతరం పదమూడు జిల్లాలతో నూతనం గా ఏర్పాటయిన విభజిత ఆంధ్ర ప్రదేశ్ లో అల్లూరి పేరుతో 14వ జిల్లా ఏర్పాటు కానుందన్న ప్రచారం అప్పట్లో జరిగింది. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు అయిన అప్పటి ప్రభుత్వం రాష్ట్రాల వికేంద్రీకరణ పై పెద్దగా పట్టించుకోకపోయినా ప్రతిపక్ష వైసిపి మాత్రం తాము అధికారంలోకి వస్తే జిల్లాల వికేంద్రీకరణ చేపట్టడమే కాకుండా కృష్ణా జిల్లాకి తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరును పెడతామని హామీ ఇచ్చి అధికార తెలుగుదేశం పార్టీకి జలక్ ఇచ్చింది. తర్వాత అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ సుదీర్ఘ కసరత్తు అనంతరం ఇరవై ఆరు జిల్లాలతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఉత్తరాంధ్ర లో అతిపెద్ద జిల్లాగా ఉన్న విశాఖ జిల్లా గత వికేంద్రీకరణ లో అతి చిన్న జిల్లాగా మారిపోయింది వంటి భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు వ్యక్తమైనప్పటి తర్వాత తెలుగుదేశం పార్టీ తాము అధికారంలోకి వస్తే జిల్లాల పునః సమీక్ష చేస్తామని హామీ ఇచ్చింది. ఈ ప్రతిపాదిత జిల్లాల లిస్ట్ వెలుగు లోకి రావడం తో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేర్చుకోబోతోంది అన్న ప్రచారం గట్టిగానే జరుగుతుంది. అయితే ప్రతిపాదిత లిస్టు లో పాత జిల్లాల పేర్లు లేకపోవడంతో ఆ పేర్లు ఉంటాయా..? లేక కొత్తవి మనుగడ లోకి వస్తాయా అన్న చర్చ మొదలయింది.పాత పేర్లను కొనసాగించకపోతే మళ్లీ పెద్ద ఎత్తున దుమారం చెలరేగే అవకాశం లేకపోలేదన్నది విశ్లేషకుల మాట.. సర్క్యూలేట్ అవుతున్న లిస్టుపై ఇటు అధికారులు కానీ అటు ప్రభుత్వ పెద్దలు గాని ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో ఎవరి అల్లికల్లో వాళ్ళున్నారు జిల్లాలపై ప్రభుత్వం నుంచి అధికార ప్రకటన వచ్చేంతవరకు ఇలాంటి కధనాలు మామూలే అంటున్నారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More