1983 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా నందమూరి తారక రామారావు గారు ప్రమాణ స్వీకారం చేసే రోజు ముందుగా మద్రాసు నుండి నాగిరెడ్డి గారిని పిలిపించుకున్నారు. ప్రమాణ స్వీకారానికి వెళ్ళేప్పుడు తన కారులో నాగిరెడ్డి గారిని కూడా తీసుకుని వెళ్ళారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం నేరుగా సెక్రటేరియేట్ కీ వారిని తీసుకుని వెళ్ళారు.
తొలిసారి గా ఎన్.టి. రామారావు గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాక ఎదురుగా నాగిరెడ్డి గారిని కూర్చో బెట్టుకొని అక్కడి వారినందరిని బయటకు పంపంచిన పిదప రామారావు గారు తన ఎదురుగా ఉన్న నాగిరెడ్డి గారితో ఒకప్పుడు మీరిచ్చిన చేయూత వల్లనే నేనింతవాణ్ణి
అయ్యాను, ఇప్పుడు ఆంధ్రదేశాన్ని జయించాను. దీనికి కారణ బిందువు మీరే అని అన్నారు.
ఈ విజయం కూడా మీదే. మీరు ఆజ్ఞాపించండి. మా చేత మంచి పాలన తెలుగువారికి ఇప్పించండి అంటూ ఆయనకు నమస్కరించారు ఎన్.టి.ఆర్. గారు.
ఆయన చూపిన వాత్సల్యానికి, కృతజ్ఞతాభావానికి చకితులై ఆనంద బాష్పాలతో నాగిరెడ్డి గారు లేచి రామారావు గారిని కౌగలించుకోవటం జరిగింది. ప్రస్తుతం లోకంలో కృతజ్ఞత అనే భావం కనుమరుగైపోతున్న ఈ రోజుల్లో ఎన్.టి. రామారావు గారు చూపిన కృతజ్ఞతాభావం ఒక్క నాగిరెడ్డి గారినే కాదు మనల్ని కూడా ఆశ్చర్య చికితులం చేస్తున్నది.. …
