మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ తో రాబోతున్నారన్న వార్తలు ఏపీ రాజకీయాల్లో పెద్దగా కదలిక తీసుకురాక పోయినా ఆయన హిందూ అనుకూల వ్యాఖ్యలు మాత్రం పెద్ద చర్చకే దారితీస్తున్నాయి. పనిలో పనిగా ఆయన వైఖరి గమనించిన ఒకరిద్దరు పాత్రికేయులు బీజేపీ లో చేరబోతున్నారా..? అని ఆడిగేసరికి నో..నో..బీజేపీ లో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేసేసారు. అయితే కాకినాడ సాధిక్ ఖాన్ వ్యవహారం లో మాట్లాడిన ఆయన హిందూ బంధువులకు మాత్రం గట్టిగానే మద్దతు పలికారు. అంతటి తో ఆగకుండా జగన్మోహన్ రెడ్డి మత మార్పిడిలకు ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చారని బహిరంగ వ్యాఖ్యలు చేసేసారు. చర్చి ల నిర్మాణానికి పూర్తి గా సహకరించారని అదే సమయంలో హిందు దేవాలయాలకు రక్షణ కూడా కరువైందని ఆరోపిస్తూ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారం లో ఉన్నప్పుడే ఏపీ లో లవ్ జిహాద్ కు బీజం పడిందని ఒక వైపు వైసీపీ ని విమర్శిస్తూనే అధికార కూటమి కూడా లవ్ జిహాద్ పై ఎందుకు స్పందించడం లేదంటూ విమర్శించారు.

వైఎస్సార్ సీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, రాజ్యసభ ఎంపీగా సుదీర్ఘకాలం కీలకంగా వ్యవహరించిన ఆయన పార్టీకి రాజీనామా చేసిన తర్వాత అవసరం వచ్చినప్పుడల్లా ఆ పార్టీ విధానాలపై విమర్శలు చేస్తున్నప్పటికీ మత ప్రాతిపదికన విమర్శలు చేయడం చర్చనీయాంశం అయ్యాయి. పార్టీ ని శ్రావణమాసం లొనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పడం కూడా హిందూ ఎజెండానే అని చెప్పకనే చెప్పినట్లయింది.
ఆ పార్టీ పేరుకు సంబంధించి ‘భారత్ జన వికాస్’ (Bharat Jana Vikas) పేరునే ఖరారు చేసే అవకాశం ఉందని సామాజిక మాధ్యమాల్లోనూ జోరుగా ప్రచారం సాగుతోంది.
పార్టీ పేరు, జెండా, అజెండా మరియు విధివిధానాలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు.
2025లో వైసీపీ కి రాజ్యసభకు రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటానన్న సమయంలో ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా లకు ధన్యవాదాలు చెప్పడాన్ని ఇప్పుడు కొంతమంది గుర్తు చేసుకొని విజయసాయిరెడ్డి బిజెపికి బీ టీమ్ అన్న ప్రచారాన్ని మొదలుపెట్టారు. దానికి తోడు తాము అధికారంలోకి వస్తే యూపీ తరహా ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పడం హిందూ ఎజెండా కు ఊతం ఇస్తోంది.అన్ని మతాలని గౌరవిస్తానంటూనే కన్వర్షన్స్ ను అడ్డుకుంటామని, హిందు సంప్రదాయాలను కించపరిస్తే ఊరుకునేది లేదని చెప్పడం పై చర్చ మొదలయ్యింది. ఇక రాజకీయంగా చూస్తే నెల్లూరు, ప్రకాశం, ఉత్తరాంధ్రలో కొన్ని సీట్లలో స్వల్ప ఓట్లను చీల్చగలిగితే, గట్టి పోటీ ఉన్న చోట ఫలితాన్ని మార్చగలిగే అవకాశం వుంటుంది.బీజేపీ ఎలాగూ హిందుత్వ ముద్ర ను వేసుకుంది కాబట్టి విజయసాయి రెడ్డి పార్టీ ని హిందువులు ఓన్ చేసుకునే అవకాశం ఎలాగులేదు.
కనీసం బీజేపీ అయినా గుర్తిస్తే వ్యక్తిగతంగా, రాజకీయంగా కొంత లబ్ది చేకూరే అవకాశం ఉంది. పూర్తి అజెండా వచ్చే వరకు వేచి చూడాలి.
