సంపూర్ణ చంద్ర గ్రహణం ఎఫెక్ట్ నిమజ్జనాలపై పడనుందా..?
దేశవ్యాప్తంగా వినాయక ఉత్సవాల సంబరం మొదలైంది. ప్రజలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకునే ఈ ఉత్సవాలలో భాగంగా వినాయక పందిళ్ళతో అన్ని వీధులు కళకళలాడిపోతుంటాయి ఎవరి శక్త్యానుసారం మూడు,ఐదు, ఏడు, తొమ్మిది, పదకొండు, ఇలా ఎవరికి వీలైనన్ని రాత్రులు మంటపాలను ఏర్పాటు చేసి అత్యంత వైభవోపేతంగా నిమజ్జనం నిర్వహిస్తారు. భారీ విగ్రహాలను ఏర్పాటు చేసి పదకొండు, పదమూడు రోజులకు (విశాఖ వంటి కొన్ని ప్రాంతాలలో ఇరవై ఒక్క రోజులకు) నిమజ్జనం చేస్తుంటారు. ఇదంతా అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ ఏడాది మాత్రం వినాయక నిమజ్జనం తొమ్మిది రోజులకే ముగించాలని పండితులు సూచిస్తున్నారు. ఈ తొమ్మిది రోజుల నిమజ్జనం వెనుక కధా కమామీషు ఏమిటో తెలుసుకోవాలంటే వ్రత కథ లోని ఓ భాగాన్ని మళ్లీ ఓసారి గుర్తు చేసుకోవాలి. ఒకానొక సందర్భంలో పొట్ట నిండుగా ఉండ్రాళ్ళు తిని అలసిపోయి కిందపడిపోతే పొట్ట పగిలి అందులోనుంచి ఉండ్రాళ్ళు, కుడుములు, బయటకు వచ్చేసి వినాయకుడు విగత జీవుడవుతాడు. అది చూసిన చంద్రుడు నవ్వడంతో ఆగ్రహించిన పార్వతి దేవి.. పాపాత్ముడా నీ దృష్టిసోకి నా కుమారుడు అచేతనంగా పడివున్నాడు.. కాబట్టి నిన్ను చూసివారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురు గాక అని శపించింది. పాపం చంద్రుడు దానికి చాలా ఫీల్ అవ్వడం తో ఉపశమనం గా వినాయక వ్రతం ఆచరించి ఆ అక్షతలు నెత్తి పై వేసుకుంటే నీలాపనిందలు తొలగిపోతాయని ఉపసంహరణ అనుగ్రహిస్తుంది పార్వతి దేవి.. ప్రతి వినాయక చవితికి ఈ కధ వింటూనే వున్నప్పటికి ఈ ప్రస్తావన ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడెప్పుడో యుగాలక్రితం జరిగిన దానికి ఈ సంవత్సరం ఆ చంద్రుడు రివెంజ్ తీర్చుకోబోతున్నాడా అన్నట్టు ఈ సంవత్సరం ఆ వినాయకుడికి ఈ చంద్రుడు విఘ్నం కల్గించ బోతున్నాడు. నిజానికి ఆయన ప్రమేయం అంతంత మాత్రమే అయినా కారకుడు ఆ చందమామే కనుక ప్రస్తావించు కోవాల్సిందే అవసరం ఏర్పడింది. ఇక అసలు విషయానికి వస్తే సెప్టెంబర్ ఏడు, ఎనిమిది తేదీలలో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుండడం తో ఉత్సవ మండపాలు గ్రహాణానంతరం ఉంచే అవకాశం లేదని పండితులు చెపుతున్నారు

పండితులు ఏమంటున్నారు..?
సెప్టెంబర్ 7 రాత్రి 9:58 గంటలకు మొదలైన గ్రహణం
సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:26 గంటలవరకు ఉంటుంది. (వాస్తవానికి పంచాంగం ప్రకారం అయితే ఎడవతేదీ ఒక రోజే తెలుగు లెక్క ప్రకారం మూడు గంటలకు మరుసటిరోజు అవుతుంది.) ఈ గ్రహణం భారత దేశంతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మరియు అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. గ్రహణానికి 9 గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది, అంటే మధ్యాహ్నం 12:57 నిమిషాలు నుండి మొదలయ్యే సూతక కాలంలో కొన్ని నియమాలు పాటించడం హిందూ సంప్రదాయం. ఆ సూతక కాలంలో దేవాలయాలు మూసివేస్తారు, మరియు పూజలు చేయరు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాలు (ఒక్క శ్రీ కాళహస్తి దేవాలయం తప్పా) మూసివేసి గ్రహాణానంతరం శుద్ధి చేసి భక్తుల దర్శానర్ధం తెరుస్తారు. మరి అలాంటి అవకాశం లేని మంటపాలను గ్రహాణానికి ముందే నిమజ్జనం చెయ్యాల్సి ఉంటుందని సింహాచల క్షేత్రం లోని శ్రీలలితా త్రిపురసుందరీపీఠం పీఠాధిపతి శ్రీ తటవర్తి అప్పలరాజు శర్మ అభిప్రాయపడ్డారు.

దేవాలయాలలో స్థిర ప్రతిష్టలు వుంటాయని అదే ఉత్సవ మండపాలలో కేవలం కలశారాధన తోనే పూజలు నిర్వర్తిస్తారని అక్కడ ఏర్పాటు చేరిన గణపతి కూడా అలంకార ప్రాయమైన విగ్రహం అవ్వడం వలన దేవతాశక్తుల ఆవాహన ఉండదని అందువలన గ్రహణ సమయం లో వాటిని మూసివేసి గ్రహాణానంతరం శుద్ధి చేసే అవకాశం ఈ తాత్కాలిక మంటపాలను ఉండదని ఆయన అంటున్నారు.. నిజానికి శ్రీరామనవమి అయినా వినాయక చవితి, దసరా ఉత్సవాలైన నవరాత్రులే జరుపుకోవాలని సంకల్పం చెప్పే సమయంలోనే రాత్రులు ప్రస్తావన వస్తుందని రాజశర్మ చెపుతున్నారు. శాస్త్రపరం గా నవమి తరువాత దశమి పూర్ణం అవుతుందని చెప్పుకొచ్చారు. ఎక్కువ రోజులు విగ్రహం నిలిపి ఉంచడం అనేది ఈ గ్రహణం తో సంబంధం లేకపోయినా ఉత్సాహం అవుతుందే తప్పా.. సంప్రదాయం ఏమాత్రం కాదని ఆయన అన్నారు.
కొంతమంది మిడిమిడి జ్ఞానం తో సంప్రదాయ పండుగలన్నీ ఎంటర్టైన్మెంట్ గా మారిపోయాయని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ పురోహితుడు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఎవరికి వారు అనుకూల వేళల్లో పూజాదికాలు నిర్వహించడం కూడా సరి కాదన్నారు. గ్రహణ సమయానికి అన్ని మండపాలలోని గణపయ్య లను నిమజ్జనం చేయాల్సిందేనని చెప్పారు. ఎరుపు రంగులో “బ్లడ్ మూన్” గా కనిపించే ఈ చంద్రగ్రహణం ముగిసిన తర్వాత గృహస్థులు పూజా గదిని మరియు ఇంటిని శుభ్రం చేసుకుని పూజలు తిరిగి ప్రారంభించవచ్చన్నారు.

అదే విధంగా ఈ చంద్ర గ్రహణం పితృ పక్ష సమయంలో ఏర్పడటం వల్ల పితృదేవతలకు చేయవలసిన కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం ఉండదని సూతక కాలం మధ్యాహ్నం ప్రారంభమవుతుంది కాబట్టి, పితృ పక్షానికి సంబంధించిన కర్మలు ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిదని ఆయన సూచించారు.
