సత్యం కాదు… సాక్ష్యమే గెలిచింది!

పార్టీ ఫిరాయింపుల వివాదంలో కీలక మలుపు

బీఆర్ఎస్ బీ ఫారం పై ఎమ్మెల్యే గా గెలిచి మళ్లీ కాంగ్రెస్ ఇచ్చిన బీ ఫారం తో సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్ పై
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లోని పారా 2(1)(a) కింద అనర్హుడయ్యారని ప్రకటించింది. ఈ అనర్హత 2024 ఏప్రిల్ 23 నుంచి అమల్లోకి వస్తుందని తీర్పు ఇస్తూనే స్పీకర్ కార్యాలయానికి ఎన్నికల కమీషన్ కు ఖైరతాబాద్ శాసనసభ స్థానం ఖాళీ అయినట్లు తెలిపింది. ఈ అంశంపై బీఆర్ఎస్ పార్టీ తీర్పు ను స్వాగతిస్తూ సత్యమేవ జయతే అని పోస్ట్లు పెట్టింది. మిగిలిన ఎనిమిది మందికి ఇదే గతి పట్టబోతోందని ఆ పార్టీ సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. దానం వ్యవహారం లో సత్యం కన్నా పార్లమెంట్ లో కాంగ్రెస్ బీ ఫారం సాక్ష్యమే కీలకపాత్ర పోషించింది విశ్లేషకులు చెపుతున్నారు.
ఒక పార్టీ గుర్తుపై ప్రజల నుంచి ఓట్లు తీసుకుని ఎమ్మెల్యేగా గెలవడం… ఆ తర్వాత మరో రాజకీయ పార్టీతో రాజకీయ అనుబంధం ఏర్పరచుకోవడం… చివరకు అదే మరో పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగడం.ఇది కేవలం రాజకీయ వ్యవహారమా..? ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఈ ప్రశ్నను మరోసారి కేంద్రంలోకి తీసుకొచ్చింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి గెలిచారు. అనంతరం 2024లో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. అంతేకాదు, అదే ఏడాది జరిగిన సికింద్రాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ అంశాన్నే అనర్హత పిటిషన్లలో కీలక ఆధారంగా చూపించారు. 2026 మార్చి 11న అసెంబ్లీ స్పీకర్ దానం నాగేందర్‌పై వచ్చిన అనర్హత పిటిషన్లను తిరస్కరించారు. తగిన సాక్ష్యాలతో ఆయన తన అసలు రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లు నిరూపించలేదన్నది స్పీకర్ నిర్ణయంలోని ప్రధాన కారణంగా వార్తా నివేదికలు పేర్కొన్నాయి.
ఆ నిర్ణయాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టులో సవాలు చేశారు. పార్టీ మారలేదా? ఎవరికి మద్దతుగా మాట్లాడాడు? ఇవన్నీ రాజకీయ చర్చలో భాగం కావచ్చు. కానీ న్యాయస్థానంలో ప్రశ్న వేరుగా ఉంటుంది. ఆ ఆరోపణకు ఆధారం ఏమిటి? అధికారిక పత్రాలు, ఎన్నికల రికార్డులు, అభ్యర్థిత్వం, బీ-ఫారం, బహిరంగ రాజకీయ చర్యలు వంటి అంశాలు కూడా కలిపి పరిశీలించడమే దానం నాగేందర్ కేసులో ఈ సాక్ష్యమే అత్యంత కీలకంగా మారింది. మిగిలిన వారితో పొంతన లేకుండా కేవలం రాజకీయ ఆరోపణగా మిగలకుండా, పత్రాల్లో నమోదైన చర్యలతో కూడిన కేసుగా మారింది.


పదో షెడ్యూల్ అసలు ఉద్దేశం ఏమిటి?
1985లో రాజ్యాంగానికి 52వ సవరణ ద్వారా పదో షెడ్యూల్ వచ్చింది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్టీ మార్పుల ద్వారా సభలోని రాజకీయ సమీకరణాలను తరచూ మార్చకుండా నిరోధించడం. పదో షెడ్యూల్‌లోని పారా 2(1)(a) ప్రకారం, ఒక రాజకీయ పార్టీకి చెందిన సభ్యుడు స్వచ్ఛందంగా ఆ పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నప్పుడు అనర్హత ప్రశ్న తలెత్తుతుంది. స్వచ్ఛందంగా సభ్యత్వాన్ని వదులుకోవడం” అంటే తప్పనిసరిగా పార్టీకి రాతపూర్వక రాజీనామా ఇవ్వడమేనా? లేదా వ్యక్తి ప్రవర్తన, రాజకీయ చర్యలు, ఎన్నికల్లో పోటీ వంటి అంశాల ద్వారా కూడా ఆ ఉద్దేశాన్ని నిర్ధారించవచ్చా? ఇదే భారత రాజకీయాల్లో ఎన్నో పార్టీ ఫిరాయింపు కేసుల్లో న్యాయపరమైన చర్చకు కారణమైన ప్రశ్న. దానం నాగేందర్ కేసులో కూడా ఇదే ప్రశ్న కీలకంగా మారింది.
పిటిషనర్ల వాదనలో ప్రధాన అంశం — బీఆర్ఎస్ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం స్వచ్ఛందంగా అసలు పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లు పరిగణించడానికి కీలకమైన ఆధారమని.
స్పీకర్ దగ్గర ఓడిన సాక్ష్యం ఇక్కడ గెలిచింది.
మార్చి 2026లో స్పీకర్ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వచ్చిన అనర్హత పిటిషన్లన్నింటినీ తిరస్కరించారు. తగిన సాక్ష్యం లేదు అని తిరస్కరిస్తే దానం నాగేందర్ విషయంలో హైకోర్టు ముందు ఉన్న రికార్డులో ఆయనే కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఎవరో చెప్పిన మాట గా కాకుండా ఎన్నికల ప్రక్రియలో నమోదైన ఒక చర్య గా హైకోర్టు భావించింది.ఇక్కడే రాజకీయ సత్యం కి, న్యాయపరమైన సాక్ష్యం కి మధ్య ఉన్న తేడా తేటతెల్లమైంది.
మిగిలిన తొమ్మిది మంది సంగతేంటి?
దానం నాగేందర్‌తో పాటు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం. సంజయ్‌కుమార్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, టి. ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీపై కూడా అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి.
స్పీకర్ ఈ పది కేసులను తిరస్కరించారు. సుప్రీంకోర్టుకు స్పీకర్ అన్ని పెండింగ్ పిటిషన్లపై నిర్ణయం తీసుకున్నట్లు మార్చి 12న తెలియజేయడంతో ఆ దశలో సుప్రీంకోర్టు కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ని కొనసాగించింది. ఆ తర్వాత స్పీకర్ నిర్ణయాలను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించే ప్రక్రియ మొదలైంది.అందులో దానం నాగేందర్ కేసు ఇప్పుడు ఒక ముఖ్యమైన పరీక్షగా మారింది. అయితే దానం నాగేందర్‌పై వచ్చిన తీర్పు ఆధారంగా మిగిలిన తొమ్మిది మందినీ ఆటోమేటిక్‌గా అనర్హులుగా ప్రకటించలేం. మిగిలిన కేసుల్లో కొందరు కాంగ్రెస్ కార్యక్రమాల్లో కనిపించడం, కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం చేయడం, కాంగ్రెస్‌లో చేరినట్లు రాజకీయ ప్రకటనలు చేయడం వంటి అంశాలు వివాదానికి కారణమయ్యాయి. కాస్తో కూస్తో కడియం శ్రీహరి కి మాత్రం కొద్దీ పాటి టెన్షన్ ఉండొచ్చు. నాగేందర్ కేసులో మరో స్థాయి ఆధారం ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో స్వయంగా అభ్యర్థిగా పోటీ చేయడం.
అది కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయంలో.
అందువల్ల మిగిలిన కేసుల్లో కూడా హైకోర్టు ఇదే న్యాయ ప్రమాణాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. కానీ ప్రతి కేసులో ఉన్న సాక్ష్యాల బలాన్ని విడిగా పరిశీలించాల్సిందే.
సత్యం ఎవరిది అన్నది రాజకీయ ప్రశ్న కావచ్చు… సాక్ష్యం ఏం చెబుతోంది అన్నదే న్యాయ ప్రశ్న
ఈ కేసు నుంచి తీసుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఇదే.

Related posts

ఖైరతాబాద్ ఉపఎన్నిక పర్ఫెక్ట్ పొలిటికల్ టర్నింగ్ కానుందా..?

తెలుగు మీడియా లో కొత్త రాజకీయం..?

ఆ శాఖకు… అంత పవరుందా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More