ఇండస్ట్రీ బాలేదండి.. సక్సెస్ రేటు అస్సలు లేదు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలు చేయకపోవడమే మంచిది.. సినిమాలు తీసి చెయ్యికాల్చుకునే కన్నా ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టుకోవడమే బెటర్.. గత దశాబ్దకాలం గా కొంతమంది నిర్మాతల ఆందోళన ఇది. ఒకప్పుడు కాసులవర్షాలు కురిపించిన థియేటర్లు వెలవెలబోవడం అలవాటు చేసుకున్నాయి. అప్పటి పరిస్థితి వేరు.. ఇప్పటి కలెక్షన్స్ వేరు. ఏడాదికి వచ్చే పది పదిహేను పెద్ద చిత్రాల కోసం 365 రోజులు ఎదురు చూసే రోజుల నుంచి ఇప్పుడిప్పుడే కళకళలాడే రోజుల్ని చూస్తున్నాయి రెండు రాష్ట్రాల్లోని తెలుగు టాకీసులు.
గత అరవై రెండు రోజుల్లో ఆరు హిట్లు కొట్టిన టాలీవుడ్ ఇప్పుడు తలెత్తుకుని వాట్ నెక్స్ట్ అంటోంది.. అందుకే ఇప్పుడు తెలుగు సినిమాకి స్వర్ణయుగం తిరిగొచ్చిందనిపిస్తోంది. మా ఇంటి బంగారం (maa inti bangaram), లెనిన్(Lenin),చెన్నై లవ్ స్టొరీ (chennai love story), కొరియన్ కనకరాజు( Korean kanaka raju) , విశ్వనాథన్ అండ్ సన్స్ (viswanadhan and sons ) , ఇరుముడి (irumudi ) ఈ ఆరు చిత్రాలతో పాటు దూకుడు లాంటి రీరిలీజ్ చిత్రాలు కూడా ఈ అరవై రెండు రోజుల్లో మంచి వసూళ్లనే రాబట్టి కలెక్షన్ల వర్షాన్ని కురిపించాయి.
అర్బన్, రూరల్, సింగిల్, మల్టీప్లెక్స్ అన్న తేడాలు చేరిపేసి దాదాపు ఎనభై శాతం హౌస్ ఫుల్స్ తో వీకెండ్లను కోట్లతో నింపేసుకున్నాయి. కంటెంట్ విషయం లో కొన్ని మిక్స్డ్ టాక్ రాబట్టుకున్నా అవన్నీ ఓవర్ బడ్జెట్ కాకపోవడం, టికెట్స్ రేట్లు పెంచకపోవడం వీటికి బాగా కలిసొచ్చాయి. సమంతా తో ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ల కు రప్పించి బోణి కొట్టిన మా ఇంటి బంగారం ఊహించని విజయాన్ని నమోదు చేసింది. బడ్జెట్ మన చేతిలో ఉంటే సినిమా ఎవరేజ్ అయినా డబ్బులు తెచ్చుకోగలమని సగర్వంగా చాటి చెప్పింది. నిజానికి ఎవరు
అవునన్నా కాదన్నా తెలుగు సినిమా కరోనాకు ముందు కరోనాకు తరువాత అని సెపరేట్ చేసుకుని చూడాల్సిందే..! కోవిడ్ ఖాళీ సమయాన్ని ఆక్రమించుకున్న ott లు థియేటర్లను మింగేసిన విషయం దాచాలన్న దాగని సత్యం. ఒకప్పుడు మినిమం గ్యారంటీ అనుకున్న సినిమాలు కూడా చతికిలబడిపోయే పరిస్థితి వచ్చింది. నెలకు మూడునాలుగు సినిమాల కోసం కేటాయించుకున్న మధ్యతరగతి బడ్జెట్ ను ప్రభుత్వ అనుమతి తో రేట్లు పెంచుకున్న ఒక్క మూవీ మింగేసేది. పైపెచ్చు మూడువారాల్లోనే ott ల్లో కొత్త సినిమా స్ట్రీమింగ్ అవ్వడంతో టీవీల్లో వస్తే చూడొచ్చులే అన్న నిర్ణయాలే ఎక్కువయ్యాయి.
తెలుగు సినిమా ని ప్రేక్షకులకు దూరం చేయడానికే అన్నట్టు మూవీ లొనే స్ట్రీమింగ్ పార్ట్నర్ ను మేకర్స్ ప్రకటించడం ప్రేక్షకుల నిర్ణయాలకు మద్దతు తెలిపినట్లయింది. దానికి తోడు ఐ బొమ్మ లాంటి పైరసీ వెబ్ సైట్లు ఉండనే ఉన్నాయి. అన్ని ముళ్ళ కంచెలు దాటుకుని ధియేటర్ లో సినిమా కలెక్షన్స్ రాబట్టాలంటే కత్తిమీద సాముగా మారిపోయింది. రోజులన్నీ ఒకేలా ఉండవు సినిమా కు కూడా అదే సూత్రం వర్తించింది. Ott సబ్స్క్రయిబర్స్ లో ఎనభై శాతం మంది బేస్ వాల్యూ సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారే. ఇప్పుడు ఆ వినియోగదారులకు విసుగొచ్చింది. వస్తున్న ప్రకటనలు ఎక్కువవ్వడం తో చూసే సినిమా ప్రశాంతతను కోల్పోయింది. ott లో చూసే కన్నా ధియేటర్ కే వెళ్లి చూద్దాం చూసిన ఫీల్ అయినా ఉంటుంది అనుకునే వారి సంఖ్య రానురాను పెరగడమే థియేటర్ల కళకళ కు ఒక కారణం.
సో కారణాలు ఏమైనా థియేటర్లకు జనాలు వస్తున్నారు. వచ్చిన ఆ ప్రేక్షకదేవుళ్ళకు పంచభక్ష్య పరమాన్నాలు వడ్డించకపోయినా పర్వాలేదు. పెట్టిన డబ్బుని వేస్ట్ చేశామన్న ఫీలింగ్ కలిగించకుండా ఉంటే చాలు. సగటు ప్రేక్షకుడికి అంతకన్నా ఇంకేం కావాలి