టాలీవుడ్ బాక్సాఫీస్ను ముంచేస్తున్న ఓవర్ బడ్జెట్
తెలుగు సినిమా అంటే ఒకప్పుడు కథాబలం, పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్. కానీ ఇప్పుడు లెక్కలు మారాయి. టాలీవుడ్ మార్కెట్ పాన్ ఇండియా స్థాయికి చేరడంతో, బడ్జెట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, ఈ బడ్జెట్ ఓవర్లోడ్ ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలకు, బయ్యర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. టాలీవుడ్ స్థాయి ఇప్పుడు పాన్ ఇండియాను దాటి గ్లోబల్ లెవల్కు చేరుకుంది.గత రెండేళ్లలో టాలీవుడ్లో వచ్చిన కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయాయి. కేవలం బడ్జెట్ పెరగడం వల్ల థియేట్రికల్ బిజినెస్ వంద నూట యాభై కోట్లు దాటేస్తోంది. ఒకప్పుడు ఏభై కోట్లు అంటేనే చాలా గొప్ప విషయం, కానీ ఇప్పుడు మూడు నుంచి ఐదు వందల కోట్లు అనేది సర్వసాధారణం అయిపోయింది. అయితే, పెరిగిన ఈ బడ్జెట్లే ఇప్పుడు టాలీవుడ్ పాలిట శాపంగా మారుతున్నాయి. పెద్ద సినిమాలకు గ్రాండియర్ ముఖ్యమే కానీ, అది కథను మించిపోకూడదు. సినిమా ఎంత ఖర్చు పెట్టి తీశాం అన్నది కాదు.. ఎంత మందికి నచ్చింది” అనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరిస్తే, ‘బడ్జెట్ ఓవర్లోడ్’ అనేది టాలీవుడ్ కి ప్రమాదం గా మారే అవకాశం ఉంది.
కంటెంట్ కంటే ఎలివేషన్స్ గ్రాఫిక్స్కే ప్రాధాన్యమా?
సినిమా అంటేనే విజువల్ ఎక్స్పీరియన్స్. కానీ, కథలో దమ్ము లేనప్పుడు ఎన్ని ఎలివేషన్స్ ఇచ్చినా ప్రపంచం అదిరిపోయే ప్రచారం చేసినా అవేమి సినిమాను గట్టెక్కించలేవన్న విషయం చాలా మంది మేకర్స్ మర్చిపోతున్నారు. కొత్తగా ఉన్న ట్రెండ్ ని అనుసరించి మైథాలాజికల్, పిరియాడికల్ వైపు మళ్లుతున్న మేకర్స్ ఇన్వెస్ట్మెంట్ కు హద్దే లేకుండా పోతుంది. కేవలం విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కోసం కోట్లు కుమ్మరించడం వల్ల ఫలితం శూన్యం అని ఇటీవల వచ్చిన పలు చిత్రాలు నిరూపించాయి. భారీ సెట్లు, ఫారిన్ లొకేషన్లు సినిమాను రిచ్గా చూపుతాయి కానీ, ప్రేక్షకుడిని థియేటర్లో కూర్చోబెట్టలేవన్నది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం.
పారితోషికాలే ప్రధమ భారం. మొత్తం బడ్జెట్లో సింహభాగం కేవలం హీరోలు, టాప్ డైరెక్టర్ల రెమ్యునరేషన్లకే పోతోంది. దీనివల్ల మేకింగ్ కోసం అనుకున్న దానికంటే తక్కువ ఖర్చు పెట్టడం లేదా బడ్జెట్ పరిమితి దాటిపోవడం జరుగుతోంది. బడ్జెట్ పెరిగేకొద్దీ థియేట్రికల్ రైట్స్ ధరలు పెరుగుతాయి. సినిమా బ్లాక్ బస్టర్ అయితే తప్ప బ్రేక్ ఈవెన్ కావడం అసాధ్యంగా మారుతోంది ఒకప్పుడు ఒక సినిమాకు ‘యావరేజ్’ టాక్ వస్తే మెల్లగా తన బడ్జెట్ను రికవరీ చేసేది. కానీ ఇప్పుడు బడ్జెట్ భారీగా ఉండటంతో:
సినిమా సూపర్ హిట్ రేంజ్ టాక్ తెచ్చుకుంటేనే లాభాల్లోకి వస్తుంది. యావరేజ్ టాక్ వస్తే, అది ట్రేడ్ పరంగా భారీ నష్టాలను మిగిల్చే కమర్షియల్ ఫ్లాప్ గా మిగిలిపోతుంది.
భారీ అంచనాలతో వచ్చి, బడ్జెట్ భారంతో బాక్సాఫీస్ వద్ద కుప్పకూలిన చిత్రాల లిస్ట్ చాలా పెద్దదే.. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ మార్కెట్ అమాంతం గా పెరిగిపోయింది. దీనిని క్యాష్ చేసుకోవాలని వందల కోట్లు కుమ్మరించిన సాహో (Saaho) & రాధే శ్యామ్ (Radhe Shyam) చిత్రాలు బొక్క బోర్లా పడ్డాయి ‘సాహో’ కోసం సుమారు రూ. 350 కోట్లు ఖర్చు చేశారు. విజువల్స్ బాగున్నా, కథలో దమ్ము లేకపోవడంతో భారీ నష్టాలను మిగిల్చింది. ఇక ‘రాధే శ్యామ్’ విషయంలోనూ అదే రిపీట్ అయ్యింది. కేవలం ఐరోపా సెట్ల కోసమే కోట్లు ఖర్చు చేశారు, దాదాపు రూ. 140 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఆచార్య చిత్రం, కనీసం సగం వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. బయ్యర్లు కొన్న రేట్లకు, వచ్చిన వసూళ్లకు పొంతన లేకుండా పోయింది. చివరకు నిర్మాతలు బయ్యర్లకు నష్టపరిహారం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది.
మరి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వందల కోట్ల ప్రాజెక్టుల భవితవ్యం ఏమిటి?
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపటిలా లేదు. ఒకప్పుడు రూ. 100 కోట్లు అంటే అది కేవలం అగ్ర హీరోలకే పరిమితం. కానీ ఇప్పుడు మిడ్ రేంజ్ యంగ్ హీరోలు సైతం రూ. 100 కోట్ల క్లబ్పై కన్నేశారు. కథ డిమాండ్ మేరకు ఖర్చు చేయడం ఒక ఎత్తైతే, పాన్ ఇండియా ఇమేజ్ కోసం ‘ఓవర్ బడ్జెట్’ చేయడం ఇప్పుడు టాలీవుడ్లో నయా ట్రెండ్ నడుస్తోంది. కార్తికేయ-2′ సక్సెస్తో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ను నమ్ముకుని నిఖిల్ హీరో గా సుమారు వంద కోట్లకు పైగా బడ్జెట్తో ‘స్వయంభూ’ (Swayambhu)
ఈ పీరియడ్ డ్రామాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ మధ్యలో మారడంతో అప్పటివరకు చిత్రీకరించిన ముప్పై శాతం రష్ ను మళ్లీ రీ షూట్ చేశారని టాక్ భారీ బడ్జెట్ చిత్రానికి రీ షూట్ అంటే ఏ మేరకు ఖర్చు అవుతుందో ఊహించుకోవచ్చు. దానితో పాటు విజువల్స్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రమిది.
ఇక నాని హీరోగా రూపొందుతున్న పారడైజ్ (Paradise) చిత్రానికి కూడా వంద కోట్ల బడ్జెట్ దాటేసింది సమాచారం. గతం లో దసరా చిత్రానికి కూడా భారీ గానే ఖర్చు చేశారు చావు తప్పి కన్ను లొట్టబోయి నట్లుగా పెట్టిన బడ్జెట్ తెచ్చేసుకొవడం తో నిర్మాత లు సేఫ్ అయిపోయారు. ఇప్పుడు పారడైజ్ మాత్రం బాక్సాఫీస్ వద్ద ఇది స్ట్రాంగ్ హిట్ నమోదు చేయడం అనివార్యం. హిట్ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మీక మందన్న జంటగా రూపొందుతున్న రణబలి (Ranabali) కి కూడా
‘ఓవర్ బడ్జెట్’ టెన్షన్ ఉంది. అలాగే అక్కినేని నాగచైతన్య వృషకర్మ(vrisha karma) కూడా ఈ లైన్ లొనే ఉంది. పొరపాటున సినిమాలకి ‘డివైడ్ టాక్’ వస్తే మాత్రం భారీ బడ్జెట్లను రికవరీ చేయడం ఇంపాజిబుల్. థియేట్రికల్ రైట్స్ రేట్లు భారీగా పెంచడం వల్ల బయ్యర్లు నిలువునా మునిగిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఈ భారీ చిత్రాల షూటింగ్ ఆలస్యమైతే, నిర్మాతలపై పడే వడ్డీల భారం సినిమా బడ్జెట్ మరో ఇరవై శాతం పెరిగే అవకాశం లేకపోలేదు. బడ్జెట్ అనేది సినిమా స్థాయిని పెంచాలి కానీ, సినిమానే మింగేయకూడదు. రూ. 20 కోట్లతో వచ్చిన ‘కాంతార'(KANTARA), ‘హనుమాన్’ (HANUMAN) వంటి సినిమాలు వందల కోట్లు వసూలు చేస్తున్నాయంటే కారణం బడ్జెట్ కాదు, అందరికీ కనెక్ట్ అయ్యే కథ.
టాలీవుడ్ నిర్మాతలు ఇప్పుడు ఆడుతున్న బడ్జెట్ జూదం సినిమాలు హిట్ అయితే రేంజ్ మారుతుంది. తేడా కొడితే మాత్రం మొత్తం పరిశ్రమే తీవ్ర సంక్షోభంలో పడే అవకాశం ఉంది