ఏభై రెండు మంది వీరుల నెత్తురు తో తడిచిన ‘బావన్ ఇమ్లీ’

భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో “బావన్ ఇమ్లీ” (Bawani Imli) అత్యంత విషాదకరమైన, వీరోచితమైన ఘటన. బ్రిటిష్ పాలకుల క్రూరత్వానికి, భారతీయ విప్లవకారుల అత్యున్నత త్యాగానికి సజీవ సాక్ష్యం. అసలు బావన్ ఇమ్లీ అంటే ఏంటి..? దీనికి వీరులకు సంబంధం ఏంటి..? ఇది ఎక్కడ ఉంది..? ఉత్తర ప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లా, బింద్కీ సమీపంలో ఖజూహా గ్రామం వద్ద ఉంది ఈ బావన్ ఇమ్లీ.
బావన్ అంటే హిందీలో ఏభై రెండు ఇమ్లీ అంటే చింతచెట్టు. ఒక చింతచెట్టుకు 52 మంది స్వాతంత్ర్య సమరయోధులను ఒకేసారి ఉరి తీసిన ఘటన వల్ల ఈ ప్రదేశానికి “బావన్ ఇమ్లీ” అనే పేరు వచ్చింది.


1857లో జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం సమయంలో ఫతేపూర్ ప్రాంతంలో ఠాకూర్ జోధా సింగ్ అటైయా అనే స్థానిక జమీందార్ కీలక పాత్ర పోషించారు. తన సహచరులతో కలిసి గెరిల్లా యుద్ధ పద్ధతిలో బ్రిటిష్ సైన్యంపై విరుచుకుపడేవారు. తాంతియా తోపే వంటి ప్రముఖ విప్లవకారులతో కలిసి పనిచేస్తూ, ఫతేపూర్ ఖజానాను కైవసం చేసుకున్నారు. వీరి దాడిలో బ్రిటిష్ కల్నల్ పావెల్ (Colonel Powell) మరణించాడు. దాంతో బ్రిటిష్ సైన్యం జోధా సింగ్ కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టింది. విప్లవ వ్యూహాలు పన్నుతున్న జోధా సింగ్, ఆయన ఏభైఒక్క సహచరుల ఆచూకీని స్థానిక వేగులు బ్రిటిష్ అధికారులకు చేరవేశారు. దాంతో బ్రిటిష్ సైన్యం వారిని చుట్టుముట్టి బంధించి ఖజూహా సమీపంలోని ఒక పెద్ద చింతచెట్టు వద్దకు తీసుకువచ్చింది. ప్రజల్లో భయం నింపాలనే దురుద్దేశంతో, ఒకే రోజు ఠాకూర్ జోధా సింగ్‌తో పాటు ఆయన 51 మంది సహచరులను ఆ చింతచెట్టు కొమ్మలకే ఉరితీసింది.


బ్రిటిషర్ల అమానుషత్వం అంతటితో ఆగకుండా, “ఎవరైనా ఈ మృతదేహాలను చెట్టు నుంచి కిందకు దింపితే, వారిని కూడా ఇదే చెట్టుకు ఉరితీస్తాం” అని బ్రిటిష్ అధికారులు హెచ్చరించారు. దీనివలన దాదాపు ఏడెనిమిది రోజుల పాటు ఆ అమరవీరుల మృతదేహాలు చెట్టుకే వేలాడుతూ ఉండిపోయాయి. చివరికి మే 3, 1858న మహారాజా భవానీ సింగ్ తన మనుషులతో కలిసి రాత్రివేళ రహస్యంగా ఆ 52 మంది మృతదేహాలను దింపి, గంగానది ఒడ్డున దహన సంస్కారాలు నిర్వహించారు. ఆ అమానుష ఘటన జరిగినప్పటి నుంచి ఆ చింతచెట్టు ఎదుగుదల ఆగిపోయిందని, ఇప్పటికీ అది అదే పరిమాణంలో ఉండిపోయిందని స్థానికులు విశ్వసిస్తారు. ఈ ప్రదేశం ఒక జాతీయ స్మారక చిహ్నంగా మారి, “బావన్ ఇమ్లీ అమర్ షహీద్ స్మారక్”గా పిలువబడుతోంది. బావన్ ఇమ్లీ అనేది కేవలం ఒక చెట్టు పేరు మాత్రమే కాదు.. స్వాతంత్ర్య సంగ్రామంలో మన పూర్వీకులు చూపించిన అతులిత త్యాగానికి ప్రతీక.

Related posts

యూపీఐ బాదుడు మొదలైందా..?అసలు నిజమేంటి..?

వెనక్కి వెళ్లిన సముద్రం.. అసలు ఏం జరిగింది?

తెలుగు మీడియా లో కొత్త రాజకీయం..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More