Vaisaakhi – Pakka Infotainment

ఆ శాఖకు… అంత పవరుందా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల దాకా… ఆ శాఖను చేపట్టిన రాజకీయ నాయకుల ప్రయాణంలో కనిపించిన కుదుపులు సరికొత్త చర్చకు తెర తీశాయి.
ఆ శాఖా మంత్రిగా బాధ్యతలు చేపడితే ఆ తర్వాత రాజకీయంగా ఏదో ఒక గండం తప్పదన్న సెంటిమెంట్ మరోసారి వార్తల్లోకి వచ్చింది.!
తెలంగాణలో జరిగిన తాజా పరిణామం ఈ పాత చర్చకు మరోసారి ప్రాణం పోసింది.
తెలుగు రాజకీయాల్లో “దేవాదాయ శాఖ మంత్రి పదవి” అంటే ఒక విచిత్రమైన భయం, రాజకీయ సెంటిమెంట్ దాగి ఉన్నాయనే ప్రచారం దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి రెండు రాష్ట్రాల వరకు విస్తరించి ఉంది. ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక వ్యవహారాలను పర్యవేక్షించే ఈ పవిత్రమైన పదవిని చేపట్టిన నాయకులకు రాజకీయంగా ఒడిదొడుకులు ఎదురవ్వడం, వివాదాల్లో చిక్కుకోవడం, అకస్మాత్తుగా పదవులు కోల్పోవడం లేదా అకాల మరణం చెందడం వంటి వరుస ఘటనలు ఈ సెంటిమెంట్‌కు బలం చేకూర్చాయి.
రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖలను చేపట్టిన కొండా సురేఖ పై వేటు వేయడం తో ఈ సెంటిమెంట్ మళ్లీ తెర మీద కొచ్చింది.

ఒకరిద్దరు మినహా ఆ శాఖ తీసుకున్న మంత్రులందరూ ఎదో విధంగా వెనుకబడ్డారనే ఉదాహరణలు ఇప్పుడు బయటకొస్తున్నాయి. నిజానికి దేవాదాయశాఖ సాధారణ ప్రభుత్వ శాఖ లాంటిది కాదు.
ఇది ఆలయాల నిర్వహణ, దేవస్థానాల ఆస్తులు, భూములు, హుండీ ఆదాయాలు, ధార్మిక సంస్థలు, దేవాలయాల పాలన, ఉత్సవాలు, భక్తుల సౌకర్యాలు వంటి అత్యంత సున్నితమైన అంశాలను తాకుతుంది. అంటే…పరిపాలన, మత విశ్వాసం, భారీ ఆస్తులు,భూములు వీటన్నిటితో పాటు రాజకీయ ప్రయోజనాలు ఇవన్నీ ఒకే చోట కలుస్తాయి.
అందుకే ఈ శాఖ మంత్రికి మిగతా శాఖల మంత్రులతో పోలిస్తే రాజకీయ రిస్క్ ఎక్కువ. ఎటువంటి ఇష్యూ వచ్చినా దేవుడి వ్యవహారం అనే భావోద్వేగాన్ని తీసుకురావడం తోనే రాజకీయ నష్టం మొదలవుతుంది. చంద్రబాబునాయుడు మంత్రివర్గం లో రెండుసార్లు దేవాదాయశాఖను నిర్వహించిన దామచర్ల అంజనేయలు , వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో విధులు నిర్వహించిన జె. రత్నాకర్‌రావు, జి. వెంకటరెడ్డి, ఎం. సత్యనారాయణ రావు (MSR) వంటి నేతలు రాజకీయంగా తదనంతరం ఉనికిలోకి లేకుండా పోయారు. 2014లో చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో పైడికొండల మాణిక్యాలరావు దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 2018 మార్చి వరకు ఆ పదవిలో ఉన్నారు. 2018లో టీడీపీ–బీజేపీ సంబంధాలు తెగిపోవడంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్‌ బీజేపీలో కీలక బాధ్యతలు నిర్వహించినప్పటికీ, 2020 ఆగస్టులో కోవిడ్‌తో మరణించారు. తర్వాత కేఈ కృష్ణమూర్తి దేవాదాయశాఖ బాధ్యతలు చేపట్టారు.2019లో టీడీపీ అధికారాన్ని కోల్పోవడంతో ఆయన మంత్రిపదవి ముగిసింది.
అలాగే అధికారం లోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

2022లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయనను తప్పించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అంతర్వేది రథం దగ్ధం, విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి వెండి రథం సింహాల మాయం, తిరుమల శ్రీవాణి ట్రస్ట్ నిధుల వివాదం వంటి వరుస ఘటనలతో ఆయన తీవ్ర ఒత్తిడిని, ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కొన్నారు. అనంతరం జరిగిన మంత్రివర్గ ప్రక్షాళనలో ఆయన పదవి కోల్పోయారు. తదుపరి దేవాదాయ మంత్రిగా పనిచేసిన కోట్టు సత్యనారాయణ కూడా ఆలయ నిధుల మళ్లింపు ఆరోపణల వివాదాల్లో చిక్కుకోవడమే కాకుండా, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఎం.వి. మైసూరా రెడ్డి వంటి సీనియర్ నేత తో పాటు ఉమ్మడి రాష్ట్రంలో ఈ శాఖను నిర్వహించిన పలువురు సీనియర్ నాయకులు దేవాదాయ శాఖ అనంతరం రాజకీయంగా మూలనపడటం లేదా సొంత పార్టీల్లోనే ప్రాధాన్యత కోల్పోవడం వంటి పరిణామాలు చవిచూశారు.
అయితే రాష్ట్ర విభజన అనంతరం
2014లో అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 నుంచి 2018 వరకు ఆయన ఆ శాఖను నిర్వహించి తరువాత అటవీశాఖ వంటి ఇతర శాఖలను నిర్వహించారు. 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోవడంతో ఆయన అధికారానికి దూరమయి కాంగ్రెస్‌లో చేరారు. ఇదిలా ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయశాఖను నిర్వహించిన పి.వి. నరసింహారావు పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 1964–67 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్ ఎండోమెంట్స్‌ శాఖను నిర్వహించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి ప్రధానమంత్రి గా ఆయన ఒక వెలుగు వెలిగారు.

అలాగే ఆ శాఖ నిర్వహించిన కోనేరు రంగారావు తరువాత ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఎవరు ఎన్ని విశ్లేషణ చేసినా ఇతర శాఖలతో పోలిస్తే దేవాదాయశాఖ కుర్చీలో కూర్చున్న మంత్రి సాధారణ మంత్రి కాదు ప్రభుత్వ ప్రతినిధి, ఆలయ పరిపాలకుడు, ఆస్తుల సంరక్షకుడు, దేవాదాయ శాఖ అనేది నిరంతరం ప్రజల, భక్తుల, ఆధ్యాత్మిక సంస్థల కళ్ల ముందే ఉండే సున్నితమైన శాఖ. సాధారణ శాఖలలో చిన్న లోపం జరిగితే పరిపాలనా లోపంగా చూస్తారు, కానీ దేవాలయాల విషయంలో చిన్న పొరపాటు లేదా ఆరోపణ వచ్చినా అది భక్తుల భావోద్వేగాలకు సంబంధించిన వివాదంగా మారి పెద్ద రాజకీయ తుఫానుగా మారుతుంది. ఏపీ, తెలంగాణల్లో లక్షల ఎకరాల ఆలయ భూములు, కోట్ల రూపాయల ఆదాయం ఉంటుంది. వీటి నిర్వహణలో వచ్చే చిన్న ఆరోపణలైనా మంత్రుల రాజకీయ జీవితానికి మచ్చ తెస్తాయి.
సంఘటనల ఆధారంగా సెంటిమెంట్ గా చాలా మంది భావిస్తున్నారు. ఏది గతం లో దేవాదాయ శాఖ ఇస్తామన్న వద్దని అలిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఏతావాతా సెంటిమెంట్ లేదంటూనే ఆ శాఖ పవర్ కి అల్లాడిపోతున్నారు. ఏ అడుగు వేస్తే ఎమోస్తుందో మనకెందుకొచ్చింది మౌనం గా ఉండడం బెటర్ అనుకుంటున్నారు. తెలంగాణ లో కొండా సురేఖ స్థానంలో రేపోమాపో విస్తరణ లో ఓ మహిళకు మంత్రి వర్గం లో స్థానం కల్పించబోతున్నారు. ప్రమాణం చేయబోతున్న ఆ మంత్రి కి దేవాదాయ శాఖ అప్పగిస్తారా..? లేక మరొకరికి ఇస్తారా చూడాలి మరి.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More